Friday, December 31, 2010

నిన్నటి పౌర్ణమి

ఆదివారం ఈనాడు పుస్తకం లో వచ్చిన "మనవడు" కథ ఎప్పటిలాగే అమెరికా వెళ్ళిన వారిని విమర్శిన్చటమనే పాతబాణీలో సాగినా కొద్దోగొప్పో ఆలోచన రేకెత్తిన్చటంలో సఫలమయింది. ఈ సందర్భంలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి "నిన్నటి పౌర్ణమి" గురించి ప్రస్తావించటం బావుంటుంది అనిపించింది. మనకు చిన్నచిన్న విషయాలు అనిపించినవి కూడా తల్లిదండ్రులను ఎంత బాధ పెడతాయో చాలా బాగా చెప్పారు. పిల్లలు, కోడళ్ళ ప్రవర్తనతో విసిగిపోయిన ఒక తండ్రి ఏమి చేశాడు అనే విషయాన్ని ఎంతో ఆసక్తిగా, తనదైన శైలిలో మల్లాదిగారు మనసుకు హత్తుకునేలా చెప్పారు.ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవ వలసిన పుస్తకం ఇది.

Thursday, December 30, 2010

ఇచ్చట చిలక జోస్యం చెప్పబడును...

కే.సి.ఆర్. కి పగటి కలలు ఎక్కువయ్యాయి. మధ్యతర ఎన్నికలలో తెలంగాణాలో టి.ఆర్.ఎస్., సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారట. జగన్ దగ్గర డబ్బుకి ఎం.ఎల్.ఏ. టిక్కెట్లు, పదవులు ఆశించే వాళ్ళు ప్రలోభపడవచ్చు కానీ జనం నమ్మే స్థితిలో లేరు.
ఇక తెలంగాణా వస్తే తెలంగాణలో తమ ఇమేజ్ పెంచుకోవటం కోసమే కాంగ్రెస్ ఎం.పీ.లచే డ్రామా ఆడించి వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేసి విద్యార్థి నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి కాంగ్రెస్ ధన, కుటిల రాజకీయాల ముందు తన ఎం.ఎల్.ఏ.లు, పార్టీ సభ్యులు కాంగ్రెస్ లో చేరకుండా ఆపటం కే.సి.ఆర్.కి తలకు మించిన పని అవుతుంది. లేదా గద్దర్ వంటి ఆలోచనాపరులు ఉండగా కే.సి.ఆర్. వంటి అవకాశవాదులను తెలంగాణా ప్రజలు గద్దెనెక్కిస్తారనుకోను.
ఆపై కే.సి.ఆర్. చేయగలిగేది ముందు గుడ్డపరుచుకొని బోర్డు పెట్టుకోవటమే ఇచ్చట చిలక జోస్యం చెప్పబడును అని!

Wednesday, December 29, 2010

కంచే చేను మేస్తే???

ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏ.లు విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే చట్టానికి వ్యతిరేకంగా ఇటువంటి పనులు చేస్తుంటే కంచే చేను మేసినట్లు లేదు? ఇటువంటి వారిపై చర్యలు తీసుకోలేమా?

డిశంబర్31 తరువాత పరిమాణాలపై చర్చలు, రెచ్చగొట్టే వాఖ్యానాలు ప్రసారం చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలపైనే చర్చ పెట్టిన మన టి.వి. వాళ్ళను ఏమనాలి? (విగ్రహారాధనని వ్యతిరేకించిన బుద్ధుడి విగ్రహానికి పూజలు చేసినట్లు) వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒకతను "ప్రజలు అంత అమాయకులా టి.వి.లో చూపించిన ప్రతీదానినీ నమ్మటానికి?" కనుక ఇటువంటి ఆదేశాలు అనవసరం అంటూ ఆవేశంగా వాదించాడు. ఒక్కసారి ఎవరినైనా అడగమనండి "మీ నాన్నగారి పేరేమిటని?" మరోసారి "నీ - - మొగుడి పేరేమిటని?" రెండోసారి జనం చెప్పుతో కొట్టకపోతే అప్పుడు అడగమనండి. జనానికి తెలుసుగదా "నాన్న" అన్నా "అమ్మ మొగుడు" అన్నా ఒకటే అని. మరి రెండోసారి ఎందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఏదైనా చెప్పే విధానంలో ఉంటుంది. జనం అర్థం చేసుకుంటారు కదా అని నోటికి వచ్చినట్లు వాగితే చెప్పు దెబ్బలు తప్పవు. అందుకే ఇటువంటి సున్నితమైన విషయాలలో సంయమనం పాటించమని ఆదేశాలు జారీ చేస్తే తప్పేంటి?

శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కనుక తమ ప్రాంతానికి వ్యతిరేకంగా వస్తే ఉద్యమం తీవ్రం చేస్తామని, రాజీనామాలు చేస్తామని రెండు ప్రాంతాల నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక కమిటీకి విలువ ఏముంది? ఇన్నాళ్ళు కమిటీపై చేసిన ఖర్చు వృధాయేనా?

రైలుని అత్యవసర పరిస్థితిలో ఆపటానికి చైన్ ఉంటుంది. దానిదగ్గర కూడా ఒక హెచ్చరిక రాసి ఉంటుంది. సరియైన కారణం లేకుండా చైన్ లాగితే ఇంత జరిమానా, ఇన్ని నెలలు జైలు శిక్ష అని. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని, ప్రజాధనం వృధా కాకూడదని. మరి ఇటువంటి మార్గదర్శకాలు ఎం.పీ.లకు, ఎం.ఎల్.ఏ.లకు ఎందుకు లేవు? ఇష్టం వచ్చినట్లు మధ్యలో రాజీనామాలు చేస్తారు? దీనివలన ప్రజాధనం, లక్షలాది ప్రజల విలువైన సమయం వృధా కావటం లేదా? సరియైన కారణం లేకుండా రాజీనామా చేసే వారు కానీ, వాళ్ళ పార్టీని కానీ ఆ ఖర్చు భరించమనాలి. ఇలా మధ్యంతర రాజీనామా చేసిన వాళ్ళని ఆ టర్మ్ మరియు మరియొక ఆరు సంవత్సరాలు ఎటువంటి పదవులకు పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వెయ్యాలి. అక్కడ మరలా ఎన్నిక నిర్వహించకుండా ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి ఉంటే (బతికుంటే, ఏకేసులలో ఇరుక్కొని జైలుకి వెళ్ళకుండా ఉంటే, పార్టీ మార్చకుండా ఉంటే) అతనికి అవకాశం ఇవ్వాలి. లేదా తృతీయ స్థానంలో ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి.

అనుభవానికి గౌరవం ఇవ్వటం మంచిదే. కానీ లేచి నిలబడటానికి కూడా ఓపిక లేని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు గుటుక్కుమంటారో తెలియదు. వీళ్ళ చరిష్మాని ఉపయోగించుకోవటానికి తప్పితే నిజంగా వాళ్ళ అనుభవమే కనుక కావాలనుకుంటే వాళ్ళు పదవిలో లేకపోయినా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు కదా. ప్రభుత్వ ఫించనుదారులకి ఒక నిభందన ఉంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి తాము బ్రతికే ఉన్నట్లు సర్టిఫికేట్ తెచ్చి ఇవ్వాలి. అలాగే వయోవృద్ధ నాయకులు కూడా పోటీ చేయబోయే ముందు సాధారణ పరిస్థితులలో (ఏ దుర్ఘటన జరగకుంటే, కుటుంబ సభ్యులు ఎటువంటి అఘాయిత్యం చేయకుంటే) మరో అయిదేళ్ళు బ్రతుకుతాడని డాక్టర్ సర్టిఫికేట్ తేవాలనే నిభందన పెట్టాలి.

ఇన్నిన్ని టాక్సులు కడుతూ ప్రజాధనం ఇలా వృధా కావటం చూస్తే ఎంతో బాదేస్తుంది. ఇటువంటి వాటిని సమర్ధవంతంగా అరికట్టగలిగితే రైతన్నలకు, చేనేత కార్మికులకు, చేతిపని వృత్తుల వారికి ఇంకామంచి సాయం అందించవచ్చు.  

Friday, December 24, 2010

ఆత్మహత్య నేరం కానీ హత్య దర్జాగా చెయ్యవచ్చు...

ఎవరైనా ఆత్మహత్యకి ప్రయత్నించినా, సమ్మెలు, దీక్షలు చేసేటపుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా బలవంతంగా హాస్పిటల్ లో చేర్చి చికిత్స చేయిస్తారు. నిన్న చంద్రబాబుకి వైద్యం చేసే బృందం కోర్ట్ ఆదేశాల ప్రకారమే వైద్యం చేశామన్నారు.

ఇచ్చాపూర్వాకంగా ఆహారం తీసుకోక పోవటం ఆత్మహత్యాయత్నం కింద పరిగణించి అరెస్ట్ చేసి వైద్యం చేయిస్తారు. కానీ ఇదే కార్పోరేట్ వైద్యశాలలు ఫీజు తక్కువైనా, కట్టలేకపోయినా వైద్యం చేయటానికి నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. మరివాటిని హత్యల కింద ఎందుకు పరిగణించకూడదు ?.

గిట్టుబాటు అయ్యే జబ్బులను మాత్రమే ఆరోగ్యశ్రీ కింద కార్పోరేట్ వైద్యశాలలు అంగీకరిస్తాయనేది జగమెరిగిన సత్యం.

Tuesday, December 21, 2010

అయ్యయ్యో ఎర్ర బస్సు...

నేను పదవ తరగతి వరకు మా ఊళ్లోనే చదివాను. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు మొదట్లో ఈ ఎర్రబస్సు అంటే నాకు చాలా విసుగ్గా ఉండేది. ఎందుకంటే ఉదయాన్నే బయలు దేరినా బస్సు టిక్కూ టిక్కూ మంటూ కాలేజ్ మొదలైన అరగంట తరువాత గాని తీసుకు వెళ్ళేది కాదు. పైగా అప్పుడే మా ఊళ్ళో ప్రైవేటు జీపులు మొదలయ్యాయి. వాటిలో జుయ్యిమని వెళుతూ అనుకునే వాడిని ఇంకెప్పుడూ ఎర్రబస్సు ఎక్కకూడదని.
 కాలేజి ప్రస్తానం ముగిసింది. హైదరాబాద్ లో ఉద్యోగపర్వం. సెలవుపై ఇంటికి వెళుతూ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెత్తటి సీటులో హాయిగా వెనక్కి వాలి పడుకుంటూ మరోసారి అనుకున్నాను ఇంకెప్పుడూ ఎర్రబస్సు ఎక్కకూడదని.
ఉద్యోగరిత్యా తమిళనాడు వెళ్లాను. మొదట్లో తమిళనాడు బస్సులు చాలా బాగా నచ్చాయి. వాటి వేగం చాలా ఎక్కువ, చార్జి మనకన్నా తక్కువ అంతేకాక బస్సులో ఒకటి లేదా రెండు టి.వి.లు. పగలు కూడా సినిమా చూస్తూ ప్రయాణం చెయ్యవచ్చు. కానీ క్రమేణా మన బస్సులకు తమిళనాడు బస్సులకు తేడా అర్థం అయింది. మన బస్సులో మొదట ఎవరు వస్తే వారికే సీటు. 3 రూపాయల టిక్కెట్ కొన్నా దర్జాగా సీటులో కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చు. కానీ తమిళనాడు లో ఎండ్ టు ఎండ్ పాసేన్జర్స్ మాత్రమే మొదట ఎక్కాలి. మధ్యలో ఎక్కవలసిన వాళ్ళు కండక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధార పడవలసిందే. మనకు లగేజి టిక్కెట్ 1 లేదా 2 రూపాయలు ఉంటుంది. కానీ తమిళనాడులో పాసెంజర్ టిక్కెట్ కి సమానంగా ఉంటుంది.
ఆపై బీహార్ వెళ్లాను. బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. ప్రభుత్వ బస్సులు చాలా తక్కువ. ప్రైవేట్ బస్సులలో పైనా కిందా వేలాడబడుతూ... (ఫెవికాల్ ఏడ్ గుర్తుందా? అలా అన్నమాట) అబ్బో దాని గురుంచి మాట్లాడక పోవటమే నయం.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాను. ఇక్కడ బస్సుల కండిషన్ మీద మన బస్సులే నయం. పైగా మనతో పోలిస్తే ఇక్కడ చార్జీలు ఎక్కువ శుభ్రత తక్కువ.
ఇవన్నీ చూసిన తరువాత ఎర్ర బస్సులపై ఆసక్తి పెరిగింది. నిజానికి మనవాళ్ళు ఇచ్చే కంసెషన్స్ (స్కూల్ పిల్లలకి బస్ పాసులు, వృద్ధులకి రాయితీలు, కేట్ కార్డులు, 20 రోజుల టికెట్ తో 30 రోజులు ప్రయాణం చేయటం, ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటే కంసెషన్స్, వీక్లీ జెట్ టికెట్లు మొదలైనవి) వేరే రాష్ట్ర రవాణా సంస్థలు ఇవ్వటం చాలా తక్కువ.
అయినా కూడా ఎర్రబస్సులు అంటే అందరికీ చులకనే. ముఖ్యంగా ఉద్యమకారులకి, ఉద్యమకారులమని చెప్పుకొనే వాళ్లకి. ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా, ఏ విషయంపై ఆందోళన చేయలన్నా మొదట చేసే పని బస్సులను తగలబెట్టటం. ఏ రంగు జెండా పార్టీ వాళ్లైనా సరే (ఆఖరికి ఎర్రజెండా అన్నలు కూడా) ఎర్ర బస్సుల మీదే ప్రతాపం చూపిస్తారు. నిరసన తెలపాలంటే మొదట చేసే పని బస్సులు తిరగకుండా చెయ్యటం. దీనివలన ఏమి సాధిస్తారో నాకైతే అర్థం కాదు. దినసరి కూలీలు పనికి వెళ్ళకుండా చేసి వాళ్ళను పస్తులు ఉంచటం, రైల్వే క్రాసింగ్ దగ్గర వేరుశనగ కాయలు అమ్ముకునే వాళ్ళను ఇబ్బంది పెట్టటం, ఆఖరికి ఆర్.టి.సి. లో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కోయించటం (బంద్ రోజు డిపోలో హాజరైనా, హాజరు వస్తుందే తప్పితే జీతం రాదు) తప్పితే దీనివాలనే ఒరిగేది ఏమీలేదు. మహా అయితే రైళ్ళను ఆపుతారు. విమానాల జోలి ఎందుకు వెళ్లారు. దమ్ముంటే విమానాశ్రయాల దగ్గర రాస్తారోకో చేసి వాళ్ళను ఆపమనండి చూద్దాం.
మరో విషయం ఏమిటంటే బస్సులకు ఇన్సూరెన్స్ ఉండదు. (ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తం గా కట్టే ప్రీమియం తో కొత్త బస్సు కొనవచ్చు) కనుక బస్సులకు జరిగే డామేజ్ వలన వచ్చే నష్టమంతా సంస్థే భరించాలి. ఈనష్టాలు లేకుంటే ఆర్.టి.సి. మరింత మెరుగైన సేవలు అందిచగలుగుతుందని నా నమ్మకం. అందుకే ఇప్పుడు ఎర్రబస్సులో ప్రయాణిస్తుంటే ఆ శబ్దం కర్ణకటోరంగాకాక శ్రావ్యమైన సంగీతంలా వినిపిస్తుంది.

Friday, December 17, 2010

ఉత్తర కుమారుడు.

నిన్నటి సభలో కే.సి.ఆర్. వాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. భూమిని బద్దలు కొట్టైనా ఆకాశాన్ని చీల్చైనా సరే తెలంగాణాని సాదిస్తాడట. భూమి ఆకాశాలు తెలంగాణా సాధనకు ఎక్కడ అడ్డుపడుతున్నాయో కొంచెం చెప్పరూ? సమస్యకు మూలాలను వెతకకుండా, కార్యాచరణ విధివిధానాలు చర్చించకుండా ఉత్తర కుమారుడిలా డ్రామా డైలాగులతో కాలం గడిపాడు. ఎక్కువగా కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ. లను విమర్శిన్చటమే పనిగా పెట్టుకున్నాడు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాత్రమే ఇస్తుంది దానిపై ఎలాగు వాదోపవాదాలు, చర్చలు జరుగుతాయి, అనుకూలంగా లేకపోతే కోర్ట్ లకు వెళ్ళటం ఎలాగు తప్పదు. అందువలనే నివేదిక వలన వెంటనే ఒరిగేది ఏమీ లేదు. అందుకే డిసెంబర్31 తరువాత తెలంగాణా రాక పోతే జనాల చేతిలో చెప్పు దెబ్బలు తినవలసి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని స్వయంగా డేట్ పొడిగించాడు. తెలంగాణా ఉద్యమ భారాన్ని ఒక్కడే మోసినట్లు ఈ ఉద్యమాన్ని తనచే నడిపించిన ఘనత ప్రజలదేనన్నాడు.
మొత్తం మీద ఈ సభ ఉద్దేశం అందరికి తెలిసిందే. డిసెంబర్ 31  తరువాత తెలంగాణా రాదు అని లోపాయకారిగా చెప్పటం. స్వబలాన్ని అంచనా వేసుకొని తెలంగాణా వస్తే ఒంటరిగా పోటీ చేయాలా లేదా ఎవరితోనైనా పొత్తు పెట్టుకొవాలో అంచనా వేసుకోవటం. దీనికోసం కొన్నిలక్షల మంది ప్రజల విలువైన సమయాన్ని వృధా చేసాడు.

Saturday, December 11, 2010

అసెంబ్లీ రౌడీలు...

విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీల వారు డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయం లో జయప్రకాష్ గారి విశ్లేషణ చాలా బావుంది. ఎవరైతే హింసాత్మక చర్యలకు పాల్పడలేదో, ఆస్తులకు నష్టం కలిగించలేదో, బలవంతపు వసూళ్ళకు పాల్పడలేదో వాళ్ళని ప్రాంతాలకు, ఉద్యమాలకు అతీతంగా విడుదల చేయాలని మిగిలిన వారిని శిక్షించాలని అన్నారు. కానీ ఇది మిగిలిన వారికి ఎందుకు రుచించటం లేదు? ఎందుకంటే విధ్యార్ధులను హింసకి పురికొల్పింది వాళ్ళే కనుక. ఇప్పుడు విద్యార్ధుల విడుదలపై స్పష్టమైన హామీ లేకుండా బయట అడుగు పెడితే విద్యార్ధులు తంతారనే భయం తోనే డ్రామాలు ఆడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు  బలవంతపు వసూళ్లు అనగానే టి.ఆర్.ఎస్. ఎందుకు ఉలిక్కి పడుతున్నట్లో?!!! విద్యార్ధుల కన్నా ముందు వాళ్ళని ప్రేరేపించిన అసెంబ్లీ రౌడీలను గుర్తించి జీవితకాలం వారి కుటుంబం మొత్తాన్ని రాజకీయాల నుండి బహిష్కరిస్తే కానీ ఇటువంటి సంఘటనలను అదుపు చేయలేము.

తెగులు సినిమా...

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమి కోరుకుంటుందో ఎటువైపు పయనిస్తుందో అర్థం కావటం లేదు.
మొదట పరభాషా చిత్రాలు విడుదల అయ్యే కేంద్రాల పరిమితి కోసం ఆందోళన చేశారు. ఎక్కువ కేంద్రాలలో విడుదల అయితే నష్టం ఏమిటి? ఆ సినిమాలు చూసిన వాళ్ళు తెలుగు సినిమాలు చూడరా? సినిమా అనేది భోజనం కాదు పూటకి ఒక్కసారే అనుకోవటానికి. ప్రేక్షకుడు తన టికెట్ డబ్బులుకి తగ్గ విషయం సినిమాలో ఉంటే వారానికి మూడు సినిమాలైనా చూస్తాడు. అయినా డబ్బులు ఖర్చు పెట్టే ప్రేక్షకుడికి మంచి సినిమా చూసే హక్కు లేదా? బలవంతంగా ఏదోవొక చెత్త వారి నెత్తిపై రుద్దేయటమేనా?
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా పైరసీ వలన నష్టపోతుందని ఏడుస్తున్టారు. కాపీ సినిమాలు తీసినప్పుడు ఆ బాధ తెలియదా? ఆఖరకు పేర్ల దగ్గర కూడా కాపీనే. ఒక సినిమా పైరసీ వలన నష్టపోతే నిర్మాతకి ఎంత బాధ కలుగుతుందో ఒక కాపీ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడికి అంతకు రెట్టింపు బాధ కలుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నిర్మాతవి మాత్రమే డబ్బులు కాదు. 50 రూపాయలు పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుడివి కూడా డబ్బులే. వాళ్ళేం టిక్కెట్ కొనటానికి దొంగ నోట్లు ఇవ్వటం లేదుగా. (సినిమాలలో ఒరిజినాలిటి ఉండాలనే కోరిక తప్ప పైరసీని సమర్దిచటం నా అభిమతం కాదని గమనించాలి.)
అయినా కళామతల్లి సేవ చేస్తున్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం అంటారు గానీ ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు కదా. వీళ్ళు పెట్టే ఎక్కువ ఖర్చంతా హీరోకి, హీరోయిన్ కి, జిమ్మిక్కులకి (గ్రాఫిక్స్ కి) మొదలైన వాటికే కదా. ఓ దేశాన్ని ఉద్దరిస్తా నష్టపోతున్న వాళ్ళలా బాధ పడతారేం.
ఇప్పుడు పరభాషా నటులను సినిమాల్లో తీసుకోకూడదట. డబ్బు పెట్టే నిర్మాతకి తెలియదా ఒక పాత్రకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకో కూడదో. అవుట్సోర్సింగ్ పై అమెరికా ఆంక్షలు విధిస్తే మనం ఆందోళన చేసిన సంగతి మరచిపోయారా? ఇదీ అలాంటిదే కదా. రేపు గోదావరి నేటివిటీతోనో, రాయలసీమ నేటివిటీతోనో సినిమా తీస్తే ఆప్రాంత నటీనటులనే తీసుకోవాలని గొడవ చేస్తారా? అంత ఖర్చు పెట్టి అంత రిస్క్ చేసి సినిమా తీసే నిర్మాతకి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని తన సినిమాలో తీసుకునే హక్కు ఎందుకు ఉండదు?
తెలుగు సినిమా కధని కాకుండా కేవలం హీరోనో, హీరోయిన్నో, డైరెక్టర్నో, గ్రాఫిక్స్ నో లేదా సిల్లీగా పేరునో నమ్ముకొని నేల విడిచి సాము చేసినంత కాలం ప్రేక్షకుల కరువుని ఎదుర్కోక తప్పదు.

Thursday, December 9, 2010

ఆత్మ గౌరవమా! అంటే?...

జగన్ కాంగ్రెస్ పార్టీ వలన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని, అందుకే అందుకే కొత్తపార్టీ పెడుతున్నానని ప్రకటించాడు. వై.ఎస్.ఆర్. చలవతో గెలిచిన వాళ్ళు ఆసంగతి ఎలా మరచిపోతారని ప్రశ్నిస్తిన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎం.ఎల్.ఏ. లు సోనియా గాంధి ఫోటోపెట్టుకొని గెలిచారంటే జగన్ వై.ఎస్.ఆర్. ఫోటో పెట్టుకొని గెలిచారంటున్నాడు. ఏదేమైనా ఇద్దరూ చెప్పేది ఒక్కటే. ఎం.ఎల్.ఏ. లు పరాన్నభ్రుక్కులని. మరి అటువంటి వాళ్లకి ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది అవకాశవాదం తప్ప.

Friday, December 3, 2010

నాకొక సందేహం...

ఒకవేళ రాష్ట్ర విభజన జరిగింది అనుకోండి వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా లేకుంటే ఎవరికైనా మెజారిటీ ఉంటే వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారా?

Thursday, December 2, 2010

నిజంగా ఇదంతా ప్రజాసేవ కోసమే?!!!

కొంతమంది మంత్రులు తమకు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వలేదని రాజీనామాకి సిద్ధమవుతున్నారు. ఇది ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం దొరకదనే బాధతోనా లేక ఎక్కువ దోచుకునే అవకాశం దొరకదనే ఆవేదనతోనా? కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రైవేట్ కంపనీ కాదని విమర్శలకు కూడా దిగారు. వారు అన్నది కి.కు.రె. నే అయిన వారి వ్యాఖలు మాత్రం సోనియాను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. ఎందుకంటే "అమ్మ" అనుమతి లేకుండా శాఖలు నిర్ణయింపబడవు కదా. కాంగ్రెస్ లో ఎప్పుడైనా మచ్చుకైనా ప్రజాస్వామ్యం ఉందా? ఉమ్మడి అభిప్రాయం అనేది కాంగ్రెస్ లో ఊహకు కూడా అందని విషయం. ఏదైనా అధిష్టానం ఇష్టం, అధిష్టానం నిర్ణయమే  శిరోధార్యం  అంటూ మొత్తం రాష్ట్రాన్ని సోనియా  పాదాల దగ్గర పెట్టి జాతి పరువు మంటగలిపారు. ఇప్పుడు అదే వాళ్ళ వరకు వచ్చేసరికి మింగుడు పడటం లేదు. మంత్రివర్గం లో మార్పులు లేదా ఏదైనా వ్యక్తిగత ప్యాకేజీలు గాని లభించకుంటే నిన్నటి వరకు జగన్ ను విమర్శించిన వీళ్ళే నిర్లజ్జగా తనతో జట్టు కడతారనటం లో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా బాబూ జగనూ నీ రొట్టె విరిగి నేతిలో పడేలా ఉందయ్యా!

Wednesday, December 1, 2010

ఆల్ ది బెస్ట్...

కొత్త ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి హార్దిక శుభాకాంక్షలు.
రాష్ట్రం ఒక్కటిగా ఉంటుందా, ముక్కలవుతుందా, ఒకవేళ అయితే ఎన్ని ముక్కలు, ఎవరు కొత్త పార్టీ పెడతారు లాంటి విషయాలను పట్టించుకోకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని, 294 నియోజక వర్గాలను సమదృష్టి తో చూస్తూ అభివృద్ధి పధం లో నడపాలని కోరుకుంటున్నాము.

Tuesday, November 30, 2010

ఈ పాపం వై.ఎస్.ఆర్. దే

జగన్ ఏ సభలలోను, సమావేశాలలోను వై.ఎస్.ఆర్. ఫోటో కావాలనే పెట్టటం లేదు అని గొడవ చేస్తున్నాడు. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ పథకానికి రాజీవ్, ఇందిరా తప్ప వేరే పేరు పెట్టాడా? రాజీవ్, ఇందిరలు ప్రధాన మంత్రులు మాత్రమే. ఒకవేళ వాళ్ళు ప్రజలకు ఏదైనా సేవ చేసినా అది ప్రజల సొమ్ముతోనే అని గమనించాలి. కానీ ఏ పార్టీతో కానీ, సామాజిక వర్గంతో గాని, ప్రాంతంతో కానీ సంభందం లేకుండా స్వాతన్త్రోద్యమం లో పాల్గొన్న వాళ్ళు, తరువాత కూడా స్వచ్చందం గా సంఘసేవ చేసినవాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళ పేరు ప్రభుత్వ పధకాలకు ఎందుకు పెట్టకూడదు. కానీ రాజీవ్, ఇందిరాలను మించిన మొనగాళ్ళు ఎవరూ లేరు అని స్వయం గా నమ్మి, అందరి మీద అదే అభిప్రాయాన్ని బలవంతం గా రుద్ది, అధిష్టానం లో కూడా అదే భ్రమ కలిగేలా చేసింది వై.ఎస్.ఆరే కదా. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అని ఇప్పుడు వై.ఎస్.ఆర్. ఫోటో కూడా పెట్టటం లేదు. ఇందులో నాకైతే ఏమీ తప్పు కనిపించటం లేదు.
వై.ఎస్.ఆర్. రాష్ట్రం కోసం ఏదో ఇరగబొడిశాడని ప్రచారం చేస్తున్నారు. కానీ తను స్వలాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టాడు. ఒక్కసారి గమనించండి. వేరే రాష్ట్రాల నుండి ఎంత మంది ఎం.పీ. లు ఎన్నికైనారు, కేంద్రం లో ఎన్ని మంత్రి పదవులు పొందారు, మన రాష్ట్రం పరిస్థితేన్టో. రాష్ట్రం పై పట్టు కోసం కేంద్ర మంత్రి పదవుల కోసం పట్టు పట్టకుండా వదిలి వేసాడని స్పష్టం గా అర్థమవుతుంది. జగన్ నాటకాలకు చెక్ పెట్టటానికి కేంద్రం అతని అక్రమ ఆస్తులపై విచారణ వేస్తుందని నాకు అనిపిస్తుంది.

Saturday, November 27, 2010

26 /11 ... ఆత్మ క్షోభ

26 /11 అప్పుడే ఆ దుర్ఘటనకు 2 సంవత్సరాలు నిండిపోయాయి. నిన్న చిదంబరంగారు అమరవీరులకు అంజలి ఘటిస్తూ పాకిస్తాన్ కి చిత్తసుద్ధి లేదని, ఈ దుర్ఘటనకి బాధ్యులైన వారిని శిక్షిస్తామనిచెప్పి ఇంత వరకు విచారణ కూడా జరపటం లేదని మొసలి కన్నీరు కార్చారు. పాకిస్తాన్ సంగతి వదిలివేయండి. మనం ఒకరిని బందీగా పట్టుకున్నాం కదా.విచారణ కూడా పూర్తై శిక్ష కూడా ఖరారైంది కదా.మరి ఆ శిక్ష ఎప్పటికి అమలు అవుతుందో, దానిని ఆలస్యం చేయటం వెనుక మర్మమేమిటో చెప్పాలి. ఈ సంఘటనకి బాధ్యులైన వారిని శిక్షిన్చేవరకు, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు మీరు ఎన్ని అంజలిలు ఘటించిన ఆ అమరవీరుల ఆత్మ మరింత క్షోభిస్తుందే తప్ప ఇసుమంతైన శాంతిన్చదు. మీ కల్లబొల్లి మాటలు నమ్మి మాయబోయే వాళ్ళు ఎవరూ లేరు అని తెలుసుకోండి. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం లో ఎంటువంటి అవకతవకలు జరిగినా ఆ అమరవీరుల కుటుంబాల ఉసురు మీకు తప్పకుండ తగులుతుంది.

ఇదేమి చోద్యం

ఇప్పటి వరకు ఒక వయోవృద్ధుడు ముఖ్యమంత్రి గా ఉన్నాడు. అతను రాష్ట్ర విభజన వంటి సున్నితమైన సమస్యతో, అనేక ఉద్యోగ సంఘాల డిమాండ్ల తో, స్వంత పార్టీలోని గ్రూపులతో సతమతమయ్యాడు. కాని అప్పుడు ఉపముఖ్యమంత్రి అవసరం ఉందని కాంగ్రెస్ కి తోచలేదు. కాని ఇప్పుడు ఒక ప్రాంతం వారినో, వర్గం వారినో సంతృప్తి పరచటానికి కొత్తగా ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తున్నారు. దీనికి తోడు కొత్తగా కొంతమందికి చోటు కల్పించటం కోసం కొన్ని శాఖలను విడదీస్తున్నారని వినవస్తుంది. దీని వలన పెరిగే ఖర్చంతా ఎవడబ్బ సొమ్మని? ఇకనైనా మంత్రులను కులాలను, ప్రాంతాలను, గ్రూపులను బట్టి కాక అవసరాలను, అర్హతలను దృష్టిలో ఉంచుకొని నియమిస్తే బావుంటుంది.

Friday, November 26, 2010

ఇడిసింది వీధికి పెద్దని

రాఖీ కా ఇన్సాఫ్ ...
ఎంత హాస్యాస్పదం.. ఎంత దౌర్భాగ్యం...
అసలు ఈ ప్రోగ్రాం చెయ్యాలని అందులోనూ రాఖీ తో చెయ్యాలని ఐడియా ఎవడికి వచ్చిందో కాని వాడిని ఏమి చేసినా తప్పులేదు. ఇటీవలే ఒక ఎపిసోడ్ చూసాను. భార్యా భర్తలు తగాదాపడి వచ్చారు. కానీ ప్రోగ్రాం లోనికి రావటం మాత్రం సెలబ్రిటీలలా చెయ్యి ఎత్తి అభివాదం చేస్తూ వచ్చారు.  అందులో రాఖీ ఆ వచ్చినామె చెప్పేది వినిపించుకోకుండా నువ్వు పెళ్లి చూపుల్లో ఎలా సిగ్గు పడ్డావో చూపించ మనటం. ఏమైనా బుర్ర ఉందా అసలు? 
అందుకేనేమో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇడిసింది వీధికి పెద్దని.

Thursday, November 25, 2010

భావి భారత ప్రధానికి? చుక్కెదురు...

బీహార్ ప్రజలు మరలా నితీష్ కుమార్ కి పట్టం కట్టి అభివృద్ధి కన్నా కులం ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. లాలూ భార్యని పోటీ చేసిన రెండు చోట్లా ఓడించి దిమ్మ తిరిగేలా చేశారు. భావి భారత ప్రధానిగా ప్రచారమవుతున్న రాహుల్ గాంధీ "మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి" అంటూ ప్రచారం చేసినా ఏ మాత్రం ఉపయోగం లేక పోయింది. రాజశేఖరరెడ్డి కష్ఠపడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తే సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని గెలిచాడని ప్రచారం చేస్తున్న వాళ్ళు బీహార్ లో సోనియా గాంధీ ఫోటోలకు ఏమి కరువు వచ్చిందో చెప్పాలి. ఏమంటారు?
వేణు బాబు పూరేటి
 

Wednesday, November 24, 2010

చౌకబారుతనానికి ప్రతిరూపం...సాక్షి

నయనతార ఒక సినిమాలో సీత పాత్ర పోషిస్తుందని సాక్షి టీవీ వాళ్ళు తెగ బాధపడి పోతున్నారు. చౌకబారు కథానాయిక సంప్రదాయాలను నాశనం చేస్తుందని ప్రత్యేక కథనాలను ప్రసారం చేసారు. వారికి తెలియదా ఒక హీరోయిన్ సెలక్షన్ లో నిర్మాత, దర్శకుడు మరియు హీరో ముగ్గురూ భాగస్వాములని? కానీ వారి ఊసే ఎత్తలేదు. బహుశా మూతిపళ్ళు రాలగొడతారని భయమేమో!
వాళ్ళు ప్రసారం చేసిన క్లిప్పింగ్స్ ని గమనించినట్లైతే సంప్రదాయాలు మంటగలసి పోతాయనే బాధకన్నా ఈ వంకతో నయనతార నటించిన కాసిన్ని హాట్ సీన్స్ ప్రసారం చేసే అవకాశం దొరికించుకున్నట్లు ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. వాళ్ళకే కనుక నిజంగా సంప్రదాయాలపై అభిమానం ఉంటే మొదట అటువంటి సినిమాలు వచినప్పుడే వాటిపై పోరాటం చేసి సెన్సార్ బోర్డు పై ఒత్తిడి తేవచ్చు కదా? ఇప్పటికే తనకి నైతిక విలువలు లేవని నిరూపించుకున్న సాక్షి ఛానల్ దీనితో తన చౌకబారుతనానికి హద్దేలేదని తేటతెల్లం చేసింది.
సినిమాలకు, ఛానల్సుకు, ఎలాక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు  కనుక సరైన సెన్సారింగ్ ఉంటే మొదట మూతపడేది సాక్షినే అని గుర్తుంచుకోవాలి.

Tuesday, November 16, 2010

వితండవాదం...

తెలంగాణా త్యాగధనుల సభలో రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదంటే జగన్ ఓదార్పు యాత్రలో సోనియా ఫోటో ఎందుకు పెట్టలేదని కొంతమంది "సంచలన"కారులు వితండవాదం చేస్తున్నారు. జగన్ మొదట నున్చి కూడా తన యాత్ర వ్యక్తిగతం అని చెబుతున్న సంగతి వారికి తెలియదా?

Monday, November 15, 2010

నిజమైన తెలంగాణా ద్రోహి...

వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణా ద్రోహి అనేవారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు నోరుమూసుకొని ఉన్నారో చెప్పగలరా? 
కెసిఆర్ తెలంగాణా పై తాత్సారం చేయటానికి, ఒక దిశ అంటూ లేకుండా ఉద్యమకారులను గందరగోళ పరచటానికి కారణం ఒకవేళ తెలంగాణా వచ్చినా తనే ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం లేకపోవటం వలనే.
కేకే తో మంతనాలకు కూడా తన ధనదాహమే  కారణం. ఒకవేళ రాష్ట్రం లో ముఖ్యమంత్రిని మార్చి కేకే కి అవకాశం వచ్చినట్లయితే తనకు ఏమి దక్కుతుందో బేరం ఆడటానికే వెళ్లికలిసినట్లు అనుకోవాలి. ఎందుకంటే తనకు ధైర్యం గా ఏదో ఒక పదవి తీసుకునే దమ్ము లేదు కనుక. 
తెలంగాణా వెనుక బడింది. దానిని వేరుచేసి మేము అభివృద్ధి చేస్తాం అనేవాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ కోసం ఎందుకు పట్టుపడుతున్నారో? దానిని వదిలేసి మిగిలిన వెనుకబడిన ప్రాంతాల మీద పూర్తి దృష్టి కేంద్రీకరించావచ్చుగా. బహుశా వాళ్ళ అక్రమ ఆస్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్ లో ఉండటం వలనేమో...
తెలంగాణావాదులమని నిరూపించుకోవటానికి సీమాంధ్ర వారిని విమర్శిన్చటమే మార్గం గా ఎంచుకోవటం మానాలి.

Thursday, November 11, 2010

జై జవాన్.....

గత నాలుగు సంవత్సరాలలో 216 మంది జవానులు ఆత్మహత్య చేసుకున్నారు అన్న వాస్తవం విస్మయాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం వ్యక్తిగత సమస్యలా లేక డిపార్ట్మెంట్ లోని ఒత్తిడులు / వేధింపులా పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

Wednesday, November 10, 2010

టెస్ట్ క్రికెట్ ను బ్రతికించండి.....

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లు చూసిన తరువాత మరలా వాటిపై ఆసక్తి పెరిగింది. టీం ఇండియా నంబర్ 1 స్థానానికి అర్హత ఉన్నదానిలానే కనిపించింది. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ 5 వ రోజు ఆట చూస్తే ఆ అభిప్రాయం తప్పు అని తేలిపోయింది. మ్యాచ్ డ్రా కావటం వేరు. మ్యాచ్ ని పని కట్టుకొని డ్రా చేయటం వేరు. భారత్ సురక్షిత స్థితిలోకి వచ్చిన తరువాతైనా డిక్లేర్ చేసి ఉండవలసినది.
చివరగా ఈరోజు ఈనాడు పేపర్లో క్రికెట్ సైనికులు అని హెడ్డింగ్ పెట్టటం కొంచెం అతిగా లేదు!

ముఖ్య మంత్రి గారి ఉదార స్వభావం!

నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఫై విమర్శలు చేస్తూ కూడా ఎంతో ఉదార స్వభావాన్ని ప్రదర్శించారు. ఆస్తులపై విచారణ కు సిద్ధమైతే కమిటీ వేసి అక్రమార్జనను నిరుపిస్తామన్నారు. అంటే ఎవరైనా అడిగితే తప్ప వారిపై విచారణ ఉండదా? లేదా ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయనంతవరకూ ఎవరు ఎంత దోచుకున్నా ఇబ్బందిలేదా? ఒకవేళ విచారణ జరిపి అక్రమార్జన బయట పడితే దానిపై హైకోర్ట్, సుప్రీంకోర్ట్ లకు వెళ్ళకూడదట! అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారికే కోర్ట్ లపై నమ్మకం లేనట్లుంది. హతవిధీ!
ఇదే వాఖ్యానాలను ఒకటికి పది సార్లు ప్రసారం చేసిన మీడియా వారికీ ఈ ప్రశ్నలు ఎందుకు తట్టలేదో? బహుశా సంచలనాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించటం వలనేమో! 

Wednesday, November 3, 2010

దీపావళి శుభాకాంక్షలు

హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు
 
   
 మీ
వేణు బాబు పూరేటి