Tuesday, December 21, 2010

అయ్యయ్యో ఎర్ర బస్సు...

నేను పదవ తరగతి వరకు మా ఊళ్లోనే చదివాను. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు మొదట్లో ఈ ఎర్రబస్సు అంటే నాకు చాలా విసుగ్గా ఉండేది. ఎందుకంటే ఉదయాన్నే బయలు దేరినా బస్సు టిక్కూ టిక్కూ మంటూ కాలేజ్ మొదలైన అరగంట తరువాత గాని తీసుకు వెళ్ళేది కాదు. పైగా అప్పుడే మా ఊళ్ళో ప్రైవేటు జీపులు మొదలయ్యాయి. వాటిలో జుయ్యిమని వెళుతూ అనుకునే వాడిని ఇంకెప్పుడూ ఎర్రబస్సు ఎక్కకూడదని.
 కాలేజి ప్రస్తానం ముగిసింది. హైదరాబాద్ లో ఉద్యోగపర్వం. సెలవుపై ఇంటికి వెళుతూ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెత్తటి సీటులో హాయిగా వెనక్కి వాలి పడుకుంటూ మరోసారి అనుకున్నాను ఇంకెప్పుడూ ఎర్రబస్సు ఎక్కకూడదని.
ఉద్యోగరిత్యా తమిళనాడు వెళ్లాను. మొదట్లో తమిళనాడు బస్సులు చాలా బాగా నచ్చాయి. వాటి వేగం చాలా ఎక్కువ, చార్జి మనకన్నా తక్కువ అంతేకాక బస్సులో ఒకటి లేదా రెండు టి.వి.లు. పగలు కూడా సినిమా చూస్తూ ప్రయాణం చెయ్యవచ్చు. కానీ క్రమేణా మన బస్సులకు తమిళనాడు బస్సులకు తేడా అర్థం అయింది. మన బస్సులో మొదట ఎవరు వస్తే వారికే సీటు. 3 రూపాయల టిక్కెట్ కొన్నా దర్జాగా సీటులో కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చు. కానీ తమిళనాడు లో ఎండ్ టు ఎండ్ పాసేన్జర్స్ మాత్రమే మొదట ఎక్కాలి. మధ్యలో ఎక్కవలసిన వాళ్ళు కండక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధార పడవలసిందే. మనకు లగేజి టిక్కెట్ 1 లేదా 2 రూపాయలు ఉంటుంది. కానీ తమిళనాడులో పాసెంజర్ టిక్కెట్ కి సమానంగా ఉంటుంది.
ఆపై బీహార్ వెళ్లాను. బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. ప్రభుత్వ బస్సులు చాలా తక్కువ. ప్రైవేట్ బస్సులలో పైనా కిందా వేలాడబడుతూ... (ఫెవికాల్ ఏడ్ గుర్తుందా? అలా అన్నమాట) అబ్బో దాని గురుంచి మాట్లాడక పోవటమే నయం.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాను. ఇక్కడ బస్సుల కండిషన్ మీద మన బస్సులే నయం. పైగా మనతో పోలిస్తే ఇక్కడ చార్జీలు ఎక్కువ శుభ్రత తక్కువ.
ఇవన్నీ చూసిన తరువాత ఎర్ర బస్సులపై ఆసక్తి పెరిగింది. నిజానికి మనవాళ్ళు ఇచ్చే కంసెషన్స్ (స్కూల్ పిల్లలకి బస్ పాసులు, వృద్ధులకి రాయితీలు, కేట్ కార్డులు, 20 రోజుల టికెట్ తో 30 రోజులు ప్రయాణం చేయటం, ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటే కంసెషన్స్, వీక్లీ జెట్ టికెట్లు మొదలైనవి) వేరే రాష్ట్ర రవాణా సంస్థలు ఇవ్వటం చాలా తక్కువ.
అయినా కూడా ఎర్రబస్సులు అంటే అందరికీ చులకనే. ముఖ్యంగా ఉద్యమకారులకి, ఉద్యమకారులమని చెప్పుకొనే వాళ్లకి. ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా, ఏ విషయంపై ఆందోళన చేయలన్నా మొదట చేసే పని బస్సులను తగలబెట్టటం. ఏ రంగు జెండా పార్టీ వాళ్లైనా సరే (ఆఖరికి ఎర్రజెండా అన్నలు కూడా) ఎర్ర బస్సుల మీదే ప్రతాపం చూపిస్తారు. నిరసన తెలపాలంటే మొదట చేసే పని బస్సులు తిరగకుండా చెయ్యటం. దీనివలన ఏమి సాధిస్తారో నాకైతే అర్థం కాదు. దినసరి కూలీలు పనికి వెళ్ళకుండా చేసి వాళ్ళను పస్తులు ఉంచటం, రైల్వే క్రాసింగ్ దగ్గర వేరుశనగ కాయలు అమ్ముకునే వాళ్ళను ఇబ్బంది పెట్టటం, ఆఖరికి ఆర్.టి.సి. లో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కోయించటం (బంద్ రోజు డిపోలో హాజరైనా, హాజరు వస్తుందే తప్పితే జీతం రాదు) తప్పితే దీనివాలనే ఒరిగేది ఏమీలేదు. మహా అయితే రైళ్ళను ఆపుతారు. విమానాల జోలి ఎందుకు వెళ్లారు. దమ్ముంటే విమానాశ్రయాల దగ్గర రాస్తారోకో చేసి వాళ్ళను ఆపమనండి చూద్దాం.
మరో విషయం ఏమిటంటే బస్సులకు ఇన్సూరెన్స్ ఉండదు. (ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తం గా కట్టే ప్రీమియం తో కొత్త బస్సు కొనవచ్చు) కనుక బస్సులకు జరిగే డామేజ్ వలన వచ్చే నష్టమంతా సంస్థే భరించాలి. ఈనష్టాలు లేకుంటే ఆర్.టి.సి. మరింత మెరుగైన సేవలు అందిచగలుగుతుందని నా నమ్మకం. అందుకే ఇప్పుడు ఎర్రబస్సులో ప్రయాణిస్తుంటే ఆ శబ్దం కర్ణకటోరంగాకాక శ్రావ్యమైన సంగీతంలా వినిపిస్తుంది.

5 comments:

  1. నిన్న న్యూస్ లో RTC బస్సుల నిర్భందం , 2 బస్సుల ద్వంసం అని చూసాకా నాది కూడా సేమ్ ఫీలింగ్ .

    ప్రతీ పనికిమాలిన ఉద్యమకారుడూ , రాజకీయ నాయకుడు , నిరసన కారుడు , వాడు వీడు అని కాదు , జనాల్ని ఏడిపించే ప్రతీ ఒక్కడు ముందు గా పడేది RTC పైనే .

    దాని వల్ల వారికి ఒరిగేది ఏముందో నాకు తెలియదు .

    ECIL X రోడ్స్ నుంచి AS రావు నగర్ లో ఒకప్పుడు మా ఆఫీసు కి వెళ్ళటానికి 2 RS /- మాత్రమె టికెట్ వుండేది .ఉద్యమాల ప్రభావతో RTC కి జరిగిన నస్తాన్ని పూరించుకోవటానికి RTC గత్యంతరం లేక టికెట్ చార్జీలు పెంచింది . ఇప్పుడు అదే డిస్టెన్స్ కి 4 RS/ టికెట్ వెల అయ్యింది. అంటే కనీస చార్జీ 100 శాతం పెరిగింది అన్న మాట .
    కూరగాయల ధరలు , RTC ధరలు ఇలా నూటికి నూరు శాతం పెరుగుతున్నాయ్ అని అప్పనం గా ఏ కంపెనీ వాడు నూరు శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వడు కదా ?, పోనీ రెండ్రూపాయలకే పల్లీలు అమ్మే వాడు లేదు నేను ఐదు రూపాయలకు తగ్గనంటే మనం కొంటామా? లేక వాడు అమ్ముకోగలడా ?

    ఉద్యమం , నిరసన , బంద్ , రాస్తా రోకో అని RTC పై పడ్డ గోప్పోల్లకేమీకాలేదు . కానీ అందరికీ ( RTC ని నమ్ముకున్న ప్రతీ సామాన్యుడికీ ) ఇది ఎంత భారమయ్యింది చెప్పండి ?

    ReplyDelete
  2. అవును. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీలాగే మన రాష్ట్రం లో చాలామంది ఇదేవిధంగా R.T.C కి జరుగుతున్నా అన్యాయం గురించి బాధపడుతునారు . ముఖ్యంగా ఈ గొడవలన్నీ గత సంవతరం డిసెంబర్ లో చాలా ఎక్కువయ్యాయి.
    అప్పటినుంచి చాలా సంఖ్యలో బస్సులు తగలబడ్డాయి. విపరీతంగా R.T.C. కి నష్టం వాటిల్లినది .బంద్ సమయం లో T.V పెట్టాలంటే భయం. అనవసరం గా బస్సులని ఎంత దారుణం గా తగలేస్తున్నారని చూస్తుంటే.... ఎంత దరిద్రమైన లోకం లో
    ఉన్నామా! అని అనిపిస్తూ ఉంటుంది .
    కాని ఇలా ఎంత కాలం సహిస్తూ కూర్చోవాలి? దీనికి తగిన పరిష్కారం ఏంటని ఆలోచిస్తే బాగుంటదని నాకనిపిస్తుంది.
    ఏమంటారు?

    ReplyDelete
  3. బస్సుల విధ్వంసం ఏదో ఒక పార్టీ బంద్ కి పిలుపు ఇచ్చినప్పుడే ఎక్కువ జరుగుతుంది. ఏ పార్టీ కార్యకర్తల వలన జరిగిందో నూటికి తొంభై శాతం ఆయా సందర్భాలలో తెలుస్తుంది. ఆపార్టీల నుండి నష్టపరిహారం వసూలు చెయ్యటమే తగిన ఉపాయం.

    ReplyDelete
  4. వాస్తవాలు చెప్పారు.
    ప్రతి గుర్తిచబడ్డ పార్టీ నుంచి, వాళ్ళు ఇలాంటి విధ్వంసక ధర్నాలు చేసినప్పుడు, పరిహారాలుగా ఇవ్వడానికి 10కోట్ల డిపాజిట్ 5ఏళ్ళకోసారి వసూలుచేసుంచాలి. డిపాజిట్ తగ్గితే టాప్-అప్ చేయించాలి. ఎలావుంది నా ఐడియా? :)

    ReplyDelete
  5. బావుంది,

    అప్పుడు ఈ పధ్ధతి ఆర్.టి.సి. కి మాత్రమే కాకుండా ప్రతి ప్రభుత్వ ఆస్తికి వర్తింప చేయవచ్చు.

    ReplyDelete