Friday, October 28, 2011

ఓ రూపాయి కథ (వ్యథ)

పేరడైజ్ లో సంగీత ట్రావెల్స్ బస్ దిగి హడావిడిగా సికిందరాబాద్ స్టేషన్ కి చేరుకున్న ఏకాంబరం ట్రైన్ బయలుదేరటానికి కి ఇంకా పదినిమిషాలు ఉండటంతో హమ్మయ్య అనుకుంటూ విపుల కొనుక్కొని జన్మభూమి ట్రైన్ ఎక్కాడు. తన సీటు దగ్గరికి వెళ్ళేసరికే తన విండో సీటుని ఎవరో దంపతులు ఆక్రమించేశారు. ప్లాట్ ఫాం మీద పెళ్లి చేసుకొని ట్రైన్ ఎక్కారేమో(!) అనిపించేంత కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి, వాళ్ళు అభ్యర్థించకముందే (కనీసం వాళ్లకి మనసులో కూడా రిక్వెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చుండదనుకోండి) విండో సీటు వాళ్ళకిచ్చేసి చివర సీట్లో కూలబడ్డాడు. పక్కనోడి బుర్రే కాదు, జేబు కూడా ఖాళీ అయిందని పైన నిండిపోయిన వాళ్ళ బేగులు చెప్తున్నాయి. తన బేగ్ కాళ్ళ దగ్గరే పెట్టుక్కూర్చుని టీ కోసం ఎదురుచూడసాగాడు. ఓ పదినిమిషాలు తరువాత వచ్చిన టీని పులిలా ఫీలవుతూ (అది కూడా బ్రష్ చేయదు కదా) తాగుతూ 10రూపాయలు ఇచ్చాడు. "చిల్లర లేదు సార్, ఆరురూపాయలు ఉంటే ఇవ్వండి లేదా ఒకరూపాయి ఉంటే ఇవ్వండి, అయిదురూపాయలు ఇస్తా"నన్నాడు ఆ టీ కుర్రాడు. (30 సంll ఉన్నా కుర్రోడనవచ్చు కదా). జేబులోంచి కాయిన్ తీసి, రూపాయా రెండు రూపాయలా అని తిప్పితిప్పి చూసిచ్చాడు ఏకాంబరం. జేబు తడుముకొని "అయిదురూపాయలు మళ్ళీ వచ్చిస్తాను సార్" అంటూ అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడా కుర్రాడు. తల తిప్పితే దారుణాలు చూడవలసి వస్తుందనే భయంతో కిటికీ లోనుంచి బయటకు చూడాలనే ఆలోచన విరమించుకొని విపులలో మునిగిపోయాడు ఏకాంబరం. మిర్యాలగూడ, నడికుడి దాటిపోయ్యాయి, పిడుగురాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది, ఇంకా చిల్లర తెచ్చివడే! ఇఖ లాభం లేదని పుస్తకం మూసేసి వాడి కోసం కాపేశాడు. మరి కొద్ది నిమిషాల్లో స్టేషన్ వస్తుందనగా వాడు కనిపించాడు. పిలవగానే టీనా కాఫీనా సార్ అనుకుంటూ వచ్చాడు. ఏమీ వద్దు, చిల్లరివ్వు అంటూ బేగ్ తీసుకుని లేచి నిలబడ్డాడు ఏకాంబరం. "ఏం చిల్లర సార్?!!" వాడి మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం. "అదేంటి, నాకు అయిదురూపాయలు ఇవ్వాలి కదా?" అన్నాడు ఏకాంబరం. "నేను అయిదు రూపాయలు ఇవ్వాల్సి ఉండటమేమిటి, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మావందరి యూనిఫాంలు ఒకేలా ఉంటాయ్" అన్నాడు టీ కుర్రాడు కొంచెం పెద్ద స్వరంతో. పక్కవాళ్ళ తలకాయలు ఠింగుమని ఏకాంబరం వైపు తిరిగాయి.  వాడు ఈసారి సార్ అన్నపదం వాడక పోగా గొంతు పెంచి ఏకవచనానికి దిగటం, వాడు ఆ ప్రశ్న అడిగిన తర్వాత వాడా కాదా అన్న సందేహం తనలో తలెత్తటం, ఈలోగా స్టేషన్ రావటంతో అయిదు రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ దిగిపోయాడు ఏకాంబరం. ఆతరువాత చాన్నాళ్ళు పది రూపాయల్లో మిగిలిపోయిన నాలుగు రూపాయలకన్నా తరువాత ఇచ్చిన రూపాయి గురించే బాధపడుతుండేవాడు ఏకాంబరం.

Wednesday, October 26, 2011

సకల జనులకు...

మిత్రులందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు.

మీ
వేణు బాబు పూరేటి.

Monday, August 22, 2011

ఎందుకు...?

సచిన్ బాగా ఆడి భారత్ ఓడిపోయిన ప్రతిసారీ సచిన్ రికార్డుల కోసమే ఆడతాడు దేశం కోసం కాదు అనటం, సచిన్ ఏదైనా మేచ్ గెలిపించాగానే దేశం కోసం ఇరగబొడిచాడు అనటం పరిపాటి అయిపోయింది. కానీ మొదటి ఇన్నింగ్స్ లో ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు బేటింగ్ చేసిన ద్రావిడే మరలా ఎందుకు ఓపెనర్ గా రావాలి? సచిన్ ఎందుకు రాలేదు? ఏమో, ఈ ప్రశ్నకు నాకైతే సరైన సమాధానమేమీ తోచలేదు.

Thursday, August 11, 2011

జన్మదిన శుభాకాంక్షలు

మా స్వామికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

This is a very special day
Your friendship has filled my life far beyond what words can say
I give thanks to the Lord for sending you my way
That's why we celebrate today
Happy Birthday!

Thursday, May 26, 2011

ఏకంబరం ప్రేమ ముచ్చట్లు...1

తనని మొదటిసారి చూసిన ఓ నెలలోపే ప్రేమలేఖ రాయాలనే కోరిక ఏకంబరంలోకలిగింది. ఇంకో నెల గడిచేసరికి అది అణుకుచుకోలేని స్థాయికి చేరుకుంది. అయినా చాన్నాళ్ళు రాయలేదంటే పెన్నో పేపరో లేక కాదు, ధైర్యం లేక! కానీ రాయకుండా ఉండలేకపోయాడు. ఏమిటీ, అది నిజంగా మొదటి ప్రేమలేఖేనా అంటారా? నిజంగా నిజం, మొదటిదే. (తను ఇంతకు ముందు ఎవరికీ లేఖలు రాయలేదు, అన్నీ స్లిప్పులే! అందుకేనేమో అందరూ స్లిప్పయిపోయారు.) అయినా తనకు వాడు రాసిన మొదటి లేఖ ఇదే కదా. ప్రేమ గురించి ముఖాముఖి చెప్పు, లేఖలు రాస్తే ఇరుక్కున్టావ్ అని శీను హెచ్చరిస్తున్నా "సీతయ్య"లా తన మాట వినిపించుకోకుండా రాశాడు.
ప్రేమలేఖ రాయటంకన్నా కష్టమైన పని ఇంకోటి కనిపించింది. అదే ప్రేమలేఖ ఇవ్వటం! ఎవరన్న ఊహ తెలియని పిల్లల చేత పంపిస్తే ఎవరికిస్తారో అని భయం, తెలిసిన పిల్లలకిస్తే అందరికీ చెబుతారేమోననే భయంతో ఆఖరికి వాడు "తెనాలి" లో కమల్ హాసన్ లా అన్నిటికీ భయపడటం మొదలుపెట్టాడు. ఆభయంలో వాడికి "తను అమ్మాయిగా ఆమె అబ్బాయిగా పుట్టుంటే ఎంత బావుండేదో!" లాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. అప్పుడయితే తను చెప్పేంత వరకు హాయిగా ఎదురు చూసేవాడిని అంటుండేవాడు. లేదా మొదట చెప్పాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి హేంగర్ కి ఉండే తన చొక్కా జేబులో ఉత్తరం పెట్టేవాడట. ఆమెకేమో హ్యాండ్ బాగ్ వాడే అలవాటు లేదాయే. ఏమిచేస్తాడు పాపం. లేదా ఎప్పటిలా ఓ చిన్న స్లిప్పయి ఉంటే ఏ KIT KAT చాక్లెట్లోనో పెట్టి ఇచ్చేవాడు. అంత ఉత్తరంతో ఆఅవకాశమూ పోయింది. అందుకే ధైర్యం చేసి డైరెక్ట్గా వాడే  ఇస్తానంటున్నాడు. అది ఎప్పటికి జరిగేనో?
ఏదోవొక వంకతో రోజూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లడకపోతే ఆరోజంతా అదోలా ఉంటుందట. ఊహు, మాట్లాడాలనుకుంటాడు, కానీ తన కబుర్లు వినటమే వాడికిష్టం. మేము కలిసినప్పుడల్లా తనని కలసినప్పుడు ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో తెగ సోది చెప్తాడు, కానీ తను పక్కన ఉంటే మాత్రం నీళ్ళు నముల్తాడు. తనఫోన్ నంబర్ అడగటానికే ఎంత ఆలోచించాడో తెలుసా? అదృష్టవశాత్తు ఆంటీ వాళ్ళ అమ్మతో మాట్లాడటం కోసం తన నంబర్ కి ఫోన్ చేయటంతో ఆసమస్య తీరిపోయింది, కాదు కాదు మొదలయింది. ఫోన్ చెయ్యాలా, వద్దా? చేస్తే ఏమి మాట్లాడాలి, లేదా "ఎందుకు ఫోన్ చేసావ్" అంటే ఏమి చెప్పాలి?. దీనికీ హేమంత్ ఓ ఉపాయం ఆలోచించాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏదో పని ఉన్నవాడిలా వాడు వెళ్ళిపోతూ "పనుంది వెళ్ళాలి, సాయంత్రం ఫోన్ చేస్తాను" అని చెప్పాలి. మాటల సందట్లో తను "సరే" అంటుంది.
 ఓవారం టైం తీసుకున్నా అంతా హేమంత్ అనుకున్నట్లే జరిగింది. నిజం చెప్పొద్దు, వాడు మొదటి సారి ఫోన్ చేసినప్పుడు అరచేతుల్లో చెమటలు పట్టాయంటే నమ్మండి. "గుండెలలో వీణలు మోగాయి" అని పుస్తకాలలో రాస్తారు చూడండి, అలానే తనతో ఫోన్ మాట్లాడాక వాడి గుండెలలో మోగిన వీణలు వాడు తిరిగిన మెలికల రూపంలో మాకు బయటకు వినిపించాయి (కనిపించాయి).

Monday, April 25, 2011

ఏకాంబరం ఉద్యోగ ప్రయత్నాలు...1

ఏకాంబరం చదువు పూర్తయింది ఇక తను చదవవలసినది ఏమీ లేదని ఫీలవటం మొదలుపెట్టాడు. ఇక తరువాత పని హైదరాబాద్ వెళ్లి కుప్పలుకుప్పలుగా ఉన్న ఉద్యోగాలలో నుంచి ఓ మాంఛి ఉద్యోగాన్ని ఎంచుకోవటమే. ఒక్కడే హైదరాబాద్ వెళ్ళటం ప్రమాదకరం కనుక (ఎందుకంటే అప్పటివరకు గుంటూరు దాటి వెళ్ళలేదు) ఒంగోలులో ఉన్న శేఖరు PP నంబర్ కి ఫోన్ చేసి తన ఆలోచన పంచుకున్నాడు (వాడికైతే ఒంగోలు నుంచి వేరేజిల్లా గుంటూరుదాకా వచ్చి కాలేజీలో చదివిన అనుభవం ఉందిమరి). వాడు తనకున్న అపారమైన తెలివితేటలన్నీ వాడి, అక్కడా ఇక్కడా విచారించి గుళ్ళో పూజారులు ఎలాగో ఉద్యోగాలకి కన్సల్టెంట్స్ అలాగనీ, కనుక ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడదాం అన్నాడు. కొద్దిగా నిరుత్సాహం చెందినా ఒక్కడే హైదరాబాద్ వెళ్ళలేడు కనుక ఆగక తప్పలేదు ఏకాంబరానికి. ఉద్యోగ ప్రకటనల కొరకు దినపత్రికలు చూడటం దినచర్యైంది.
ఒకానొకరోజు ఈనాడు దినపత్రిక గుంటూరు ఎడిషన్ లో వచ్చిన ఓప్రకటనలో అన్ని రకాల చదువుల వారికీ, అనుభవం ఉన్నా లేకపోయినా కూడు, గూడు, గుడ్డ ( కాంటీన్, క్వార్టర్స్, యూనిఫారం) ఇచ్చే కంపెనీలో బొచ్చెడు ఖాళీలు ఉన్నాయని చూసి ఆ కన్సల్టెన్సీ ఫోన్ చేసి ఉద్యోగాలున్నాయా అని అడిగాడు. వాళ్ళు పేరు, ఊరు, విద్యార్హతలు కనుక్కొని రెండే ఖాళీలు ఉన్నాయని మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనటంతో అప్పుడప్పుడే పూర్తిస్థాయిలో వస్తున్న గడ్డం కూడా చేయించుకోకుండా సర్టిఫికెట్లు తీసుకొని, ఈ సంగతి శేఖరుకి తెలియచేసే బాధ్యత వాళ్ళ అన్నయపై పడేసి హుటాహుటిన గుంటూరు బయలుదేరి వెళ్ళాడు. గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉండటంతో అడ్రస్ కనుక్కోవటం పెద్దకష్టం కాలేదు. కన్సల్టెన్సీ పేరు గుర్తులేదు కాని, అక్కడ ఉన్నామె బొద్దుగాను, ఆమెపేరు R అక్షరంతో మొదలవుతుందనీ చెప్పినట్లు గుర్తు. కాసేపు వీడితో మాట్లాడి, ఓ 100 రూపాయలు ఫీజు కట్టించుకొంది (ఎంత బేరమాడిన కన్సెషన్ ఇవ్వలేదు). వీళ్ళు చూపే ఉద్యోగాలన్నీ గుంటూరు చుట్టుపక్కలేనట. వాళ్ళు పంపినచోట సెలక్ట్ అయితే మొదటి జీతంలో సగం వాళ్ళకివ్వాలాట. ఈవిడేమిటీ సెలక్షన్ అంటుంది, శేఖరుగాడేమో సరాసరి జాయినింగ్ అన్నట్లు చెప్పాడు అనుకుంటుండగానే యాదావిదిగా వాడికో వక్రపాలోచన వచ్చింది. ఈవిడ మొదటిజీతంలో సగమన్నది కానీ నెలజీతంలో సగమనలేదు కదా. ఇవాళ ఎలాగు పదిహేనో తారీఖు. జాయిన్ అయ్యేసరికి (సెలక్షన్ వాడు ఉదయం బస్సెక్కినప్పుడే అయిపోయింది) 22 అవుతుంది. ఒకటో తారీఖు జీతం రాగానే అందులో సగం వీళ్ళ మొఖాన కొట్టానంటే ఓపని అయిపోతుందనుకుంటూ తక్కువ మొత్తం చూడగానే ఆమె మొహం ఎలా మాడిపోతుందో ఊహించుకోవటం వలన వస్తున్న నవ్వుని పెదవి కొరుక్కుంటూ ఆపుతూ, వాళ్ళ కన్సల్టెన్సీ ఫార్మాట్లో బయోడేటా రాసిచ్చాడు. ఆమె బయోడేటా, తన సిఫార్సు ఉత్తరాన్ని ఓ కవరులో ఉంచి అడ్రస్ చెప్పి పంపించింది. అది ఓ స్పిన్నింగ్ మిల్, పెద్దదే. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేసాడు. ఏకాంబరం ఠీవిగా కవర్ తీసి, జాయిన్ అవ్వటానికి వచ్చానని చెప్పబోయి, ఎందుకైనా మంచిదని ఉద్యోగం కోసం వచ్చానని చెప్పాడు. వాడు కవర్ తీసి చూసి కనీసం చదవనైనా చదవకుండానే పరపరా చించేసాడు. ఇక్కడ XXXX ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, XXX ఇస్తారు చేస్తావా అన్నాడు. పళ్ళు పటపట కొరుక్కుంటూ తల వేలాడేసుకొని మళ్ళీ "R" దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు.
దానికామె "అరరే, మిమ్మల్ని వెళ్లి *ఫలానా* వాళ్ళనే కలవమని చెప్పటం మరచిపోయాను, ఇప్పడు వెళ్లి......."
"నో" పెద్దగా అరిచాడు ఏకాంబరం, "పొద్దునేవో రెండో ఖాళీలు ఉన్నాయన్నారు, ఇవేనా అవి?"
"మీరు పొద్దున్న ఏమి చదివారు అంటే పాలిటెక్నిక్ అని చెప్పారు మీ సర్తిఫికేట్లో డిప్లొమా అని ఉందీ?"
"రెండూ ఒకటే"
"నిజమా?, రెండూ ఒకటేనా?!"
"ఆ నిజమే" కోపంగా చెప్పాడు ఏకాంబరం.
"అయితే మీరు ఇప్పుడు xxxx కి వెళ్ళండి" అంటూ మరో ఉత్తరం రాసిచ్చింది.
తన క్వాలిఫికేషన్ ఏమిటో అర్థం చేసుకోలేనావిడ తనకేమి ఉద్యోగం చూపగలదో అనే అనుమానం ఏకాంబరంలో మొదలయింది. సరే ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ ఆమె ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు. ఆ ఫాక్టరీ ఉన్న పరిస్థితిని చూసి లోపలి కూడా వెళ్ళకుండానే, ఉత్తరాని కవర్ తో సహా చింపేసి, వంద రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు.

Saturday, April 23, 2011

ఛీ...

కాలేజీ నుంచి వచ్చిన ఏకాంబరం ఫ్రెషప్ అయ్యి "అమ్మో, అప్పుడే మార్చ్ వచ్చింది, ఈరోజు ఖచ్చితంగా పుస్తకం తెరవాల్సిందే అనుకుంటుండగానే "ఒర్రేయ్, మీకు ఈసంగతి తెలుసారా?" అనుకుంటూ సుబ్బారావు వచ్చేసాడు. వాణ్ని కదిలిస్తే గంటకు తక్కువ మాట్లాడడు, కాబట్టి వాడు మొదలు పెట్టకముందే పుస్తకం తీసుకుని టెర్రస్ మీదకు వెళదామనుకుంటుండగానే రామకృష్ణ అడగనే అడిగేసాడు "ఏ సంగతిరా?" అని. ఒక్కసారి సుబ్బిగాడు మొదలు పెట్టాడంటే మధ్యలో వెళ్ళాలంటే చాలా కష్టం, ఎలాంటి విషయాన్నైనా చాలా ఆసక్తికరంగా చెప్తాడు.
"నేను ఇప్పుడే ఓయాక్సిడెంట్ చూసారా, అబ్బా ఇద్దరిలో ఒకడు స్పాట్లో అవుట్."
"ఎలా జరిగింది?"
"ముందెళుతున్న ఆటోవాడు రోడ్ పక్కన నిలబడి ఉన్న వాళ్ళను చూసి పేసెంజర్స్ అనుకోని ఎటువంటి సిగ్నల్ లేకుండా ఠక్కున ఆపేసాడు. దాని వెనుక వెళుతున్న మోటర్ సైకిల్ వాళ్ళు కూడా పాపం కష్టపడి బ్రేకు వేయగలిగారు కానీ, వాళ్ళ వెనుక వస్తున్న ట్రిప్పర్ వాడు ఆపలేకపోయాడు. ట్రిప్పర్ వీళ్ళని గుద్దటంతో వీళ్ళ బండి ఎదుటి ఆటోని గుద్దుకొని పడిపోయారు.  వెనుక కూర్చున్నతని పెళ్ళట, బండి నడుపుతున్నది వాళ్ళ బామ్మర్దే, శుభలేఖలు పంచటానికి వెళుతున్నారట, పాపం పెళ్లి కొడుకే చనిపోయాడు."
"అక్కడికక్కడేనా?"
"మరి, నువ్వు చూడలేదా అక్కడక్కడా బ్రెయిన్ పడుంది, అబ్బా రక్తం కారిందిరా బాబు, ఒళ్ళు గగుర్పొడిచిందనుకో"
"ఆపరా నీ వర్ణనలు, వినటానికే భయంకరంగా ఉంది."
"లేదు బాబాయ్, అసలు ఆ లారీ గుద్దగానే ..............................................................." వాడి నోరు అలా వాగుతూనే ఉంది. పొరపాటున ఆపినా ఎవరన్నా రూములోకి రాగానే మరలా మొదలు. రెండు మూడు రోజులు ఇదే గొడవ.
వీళ్ళకి ఆబాధితుల కనీస సానుభూతి కూడా ఉండదు. మాట్లాడటానికి ఓ టాపిక్ దొరికింది, అంతే.
ఇలాంటి సుబ్బారావులను మించి పోతున్నాయ్ ఇప్పటి న్యూస్ ఛానళ్ళు. వార్తలను వార్తలగా అందించటం కన్నా కూడా భయానక దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేయటం, వీలయితే గ్రాఫిక్స్ తో ఎలా జరిగుంటుందో కధనాలు చూపటంలోనే వీళ్ళ ఆసక్తి ఎక్కువ. మహిళపై అత్యాచారం జరిగినప్పుడు వీళ్ళ ఇంటర్వ్యూలు, చర్చలు చూస్తుంటే టీవీ బద్దలు కొట్టాలనిపిస్తుంది. బోరు బావిలో పిల్లలు పడినప్పుడైతే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఫలానా నంబర్ కి SMS లు పంపమని స్క్రోలింగులు. (ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆ SMS చార్జ్ లో కొంత వీళ్ళకి ముడుతుందట.) ఇప్పుడు సత్యసాయిబాబా గురించి కూడా అంతే. ఆవార్తని మొదట వెలికి తెచ్చింది తామేనని చెప్పుకోవటానికి ABN పడుతున్న తంటాలు చూస్తే కోపం, నవ్వూ రెండూ రాకమానవు. రోజూ ఓగంట వార్తలు(?) చూస్తే జీవితం మీద విరక్తి వస్తుందేమో!?

Friday, April 15, 2011

నక్షత్రపు చిహ్నం.

నేనూ స్వామీ పిచ్చాపాటీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా (మంచి విషయాలు ఎప్పుడు మాట్లాడుకున్నామనిలే!) టాపిక్ గుర్తుల / చిహ్నాల పైకి మళ్ళింది. అది దేశాల చిహ్నాలు, ఎన్నికల గుర్తులు, ఉత్పత్తుల గుర్తులు, వివిధ వ్యాధుల గుర్తుల మీదుగా ఆఖరికి మన తరగతి పుస్తకాలలో ముఖ్యమైన పద్యాల దగ్గర ఉండే నక్షత్రపు చిహ్నం దగ్గరకు వచ్చింది. స్కూలులో ఆఖరి పరీక్షలు దగ్గరి వచ్చినప్పుడు మాస్టార్లు ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టి చదివించటం గుర్తు వచ్చింది. మాటల్లో స్వామీ వాళ్లకు ప్రతి సబ్జెక్ట్ లోను ఒకటి రెండు అధ్యాయాలు పూర్తిగా చెప్పేవాళ్ళు కాదని చెపితే విని ఆశ్చర్య పోయాను. ఛాయిస్ ఉండే చోట కష్టమైనా అధ్యాయాలు వదిలేస్తారట. పోనీ వాళ్ళదేమన్నా ప్రైవేటు స్కూలా అంటే అదీ కాదు. అన్ని అధ్యాయాలు బోధించనవసరం లేకపోతే అవి పాఠ్యాంశాలుగా ఎందుకు ఉన్నట్లు? రేంకుల పిచ్చిలో ముఖ్యమైన వాటిని బట్టీ కొట్టించటం సబబేనా? అలా మాట్లాడుకుంటూ మా పదవ తరగతి రోజులలోకి (1997 బేచ్) వెళ్లి పోయాను.
మాది  ప్రభుత్వ పాఠశాల. బిట్ బేంకులు, కొచ్చెన్ బేంకులు, స్టడీ మెటీరియల్, ఆల్ ఇన్ వన్ ల గురించి వినటమే కానీ మాలో ఎవ్వరి దగ్గరా ఉండేవి కావు. మాస్టార్లు ప్రతి సంవత్సరం పదవ తరగతి ఆఖరి పరీక్షల పేపర్లు ఫైల్ చేసి ఉంచేవాళ్ళు. ప్రతి సబ్జెక్ట్ లోనూ ప్రశ్నలకు జవాబులను వాచకంలో గుర్తు పెట్టటమో లేక నోట్సు చెప్పటమో చేసేవాళ్ళు. ఇంగ్లిష్ అయితే అలా గుర్తు పెట్టటం కుదరని వాటికి జవాబులను (నేను లేదా ఉల్లి రామాంజనేయులు)  బ్లాక్ బోర్డ్ పై రాస్తే నోట్స్ రాసుకునేవాళ్ళం. నోట్సులు కరెక్షన్ చేయటం కూడా జరిగేది. 7, 10 తరగతులకి పబ్లిక్ పరీక్షలు ఉండటంతో రోజూ ఉదయం, సాయంత్రం 2 గంటల చొప్పున ట్యూషన్ (నామమాత్రపు ఫీజుతో) ఉండేది. ట్యూషన్ కి కూడా తరగతి ఉపాధ్యాయులే వచ్చేవాళ్ళు. మా స్కూలు క్రమశిక్షణ తో ఉండటానికి ముఖ్య కారణం మా ప్రధానోపాధ్యాయులు పిచ్చిరెడ్డి గారే అయినా పొగడవలసి వస్తే ముందుగా మా సాంఘిక శాస్త్రం మాస్టారు స్వర్గీయ గుదే వెంకటేశ్వర్లు గారు గుర్తు వస్తారు. వారు మాకు 8, 9, 10వ తరగతులలో సాంఘిక శాస్త్రం బోధించారు. ఆయనకి బోధనలో తనదైన శైలి ఉండేది. 60 మంది ఉన్న మా క్లాసుని 10 మంది చొప్పున 6 గ్రూపులు చేసారు. ప్రతి గ్రూపుకి ఒకరు లీడర్ గా ఉండేవాళ్ళు. ప్రతి గ్రూపు రోజు మార్చి రోజు 3 లేదా 4 ప్రశ్నలు చొప్పున చూడకుండా వ్రాయాలి. ఆ తరువాత ఒకరి వ్రాసిన దానిని మరొకరం కరెక్షన్ చేసేవాళ్ళం. రాసిన దానిని బట్టి గరిష్టంగా 5 సార్ల వరకు ఇంపోజిషన్ ఇచ్చుకునే వాళ్ళం. దీనికి తోడూ రోజుకు నలుగురు చొప్పున (ఒకరు భూగోళశాస్త్రం, ఒకరు చరిత్ర, ఒకరు పౌరనీతిశాస్త్రం మరొకరు ఆర్ధికశాస్త్రం) నాలుగు పాఠాల నుంచి బిట్లు తయారు చేసుకు వచ్చి క్లాసులో మిగిలిన వాళ్ళను అడిగేవాళ్ళు. చెప్పలేని వారికి  5 సార్లు ఇంపోజిషన్. వాటిని తయారు చేసేవాళ్ళు పాఠంలోనుంచి వాళ్ళ ఇష్టమొచ్చిన వాటిని బిట్లుగా వ్రాసుకొస్తారు కనుక ఖచ్చితంగా పాఠం మొత్తం చదవాల్సి వచ్చేది. వీటికి తోడూ వారం లో ఒక రోజు వక్తృత్వ పోటీలు. ఈ వారం ఒక టాపిక్ చెపుతారు వచ్చేవారం దానిపై మాట్లాడాలి. దీనిలో హాజరు పెంచటం కోసం ప్రతివారం అయిదుగురు చొప్పున ఖచ్చితంగా పాల్గొనాలి, స్వచ్చందంగా పాల్గొనేవాళ్ళు ఎంతమందైనా పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఏ కారణం చేతనైనా గైర్హాజరైతే ఆ తరువాత వారం పాల్గొనాలిసిందే. ఎలాగూ తప్పించుకోలేం కనుక ఈ కారణం వలన ఎవరూ గైర్హాజరు అయ్యేవాళ్ళు కాదు.
ఇప్పుడు నేను కొంత మంది స్కూలు పిల్లలో గమనించినదేమిటంటే మీరు వాళ్ళని ప్రశ్నలు వరుసలో అడుగుతున్నంతసేపూ జవాబులు టకటకా అప్పచెపుతారు. అదే వరుస మార్చామనుకోండి, బ్రేకు పడిపోతుంది. ఎన్నో ప్రశ్న అని అడుగుతారు. వీళ్ళు చేసే తప్పేమిటంటే జవాబుల వరకే చదువుతారు తప్ప ప్రశ్నలు చదవరు. అందుకే వీళ్ళకి జవాబులు తెలుసు తప్ప అవి ఏప్రశ్నకి జవాబులో అంతగా గుర్తుండదు. కొంతమంది పిల్లలు ఇంగ్లీష్, హిందీ ప్రశ్నలను అర్థం చేసుకోలేక జవాబు తెలిసీ రాయలేక పోయేవారు. అందుకేనేమో మా ప్రధానోపాధ్యాయులు వారు జవాబుని చదివే ప్రతిసారీ ప్రశ్నను కూడా చదవాలని పదే పదే చెప్పేవాళ్ళు. ఆయన మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా చెప్పేవాళ్ళు. పాఠం చెప్పేక ముఖ్యమైన / కఠిన పదాలకు అర్థాలు నోట్సులో వ్రాయించి ఒకటి రెండు రోజులు వాటిని చదివించి ఆ తరువాతే ప్రశ్నలు జవాబులు చెప్పేవారు.
మాకు 10 వ తరగతిలో బోధించిన ఆరుగురిలో ఇద్దరు స్వర్గస్తులయ్యారు. మిగిలిన నలుగురిలో ఎవరైనా కనపడినప్పుడు పలకరిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు.అటువంటి 
అధ్యాపకులు దొరకటం నిజంగా మా అదృష్టం తప్ప వేరే ఏమీ కాదు .

Friday, April 8, 2011

"గురు"తుంచుకోవలసిన విషయం

టీమిండియా కోచ్ గేరీ కిర్ స్టన్ పదవి నుంచి తప్పుకున్నాక కొత్త కోచ్ పై ఊహాగానాలు పెరిగాయి. ఇందులో ప్రముఖంగా షేన్ వార్న్, గంగూలీ, అనిల్ కుంబ్లే మరియు ఫ్లెమింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. చివరి ఇద్దరి సంగతి ఏమో కానీ మొదటి ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంచుకున్నా తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది.
ఇద్దరూ మంచి ఆటగాళ్లే కావచ్చు. కానీ ప్రతి మంచి ఆటగాడు మంచి కోచ్ కాలేడు. షేన్ వార్న్ డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సంగతీ, అందరి ఆస్ట్రెలియన్ లానే తన నోటి దూల సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం IPL లో ఆడుతూ సంపాదించుకుంటున్నాడు కాబట్టి నోరు మూసుకున్నాడు కానీ లేకుంటే ఇండియాను విమర్శించకుండా ఉండేవాడా? ఇక తన వివాహేతర సంభందాలు, వివాదాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవి తన వ్యక్తిగతమైతే అవవచ్చుగాక. కానీ కనీస నైతిక విలువలు లేని మనిషి జట్టుని ఒక్కతాటిపై నడిపించగలడా?
వార్న్ తో పోలిస్తే గంగూలీ కొంత నయం, కనీసం బహిరంగంగా తప్పుచేయటానికి భయపడతాడు. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు యువకులను ప్రోత్సహించిన మాట నిజమే కానీ తన వల్లనే 2003 వరల్డ్ కప్ టీం లో లక్ష్మన్ బదులు దినేష్ మోంగియాకి స్థానం లభించిందని నా నిశ్చితాభిప్రాయం. పైగా తనని టీం లోనుంచి తీసివేసినప్పుడే బెంగాల్ లో అల్లర్లు చేయిచిన వ్యక్తి కోచ్ అయితే తన మాట నెగ్గించుకోవటానికి ఏమి చేస్తాడో చెప్పలేం కదా!
చాంపియన్ కావటం ఎంత కష్టమో ఆ హోదా నిలబెట్టుకోవటం అంతకు మించి కష్టం. కాబట్టి ఇగో లేనివాణ్ణి, టీం అవసరాలు గుర్తించి, సమైఖ్యంగా ఉంచగలిగేవాణ్ని మాత్రమే కోచ్ గా తీసుకురావాలి.

Tuesday, April 5, 2011

పిలుపే బంగారమాయరా...

మనకే సొంతమైనదీ, మనకన్నా ఎక్కువగా ఇతరులు వాడేది ఏమిటీ?
మీరు కరెక్టు గానే ఊహించారు, మన పేరు.
చిన్నప్పటి నుంచీ నా పేరంటే నాకు విపరీతమైన ఇష్టం. పిలవటానికి షార్ట్ చెయ్యనవసరం లేదు, పేరుని ఖైమా కొట్టి వెక్కిరించటానికి లేదు ఇలా రకరకాల కారణాల వలన నా ఇష్టం ఇంకా ఇంకా పెరిగి పోయింది. కానీ పదవ తరగతికి వచ్చేసరికి మొదటి సారి ఎదురు దెబ్బ తగిలింది. మా హెడ్ మాస్టారు నా పేరు వదిలేసి ఇంటి పేరుతో పిలిచేవారు. ఆయన ఎంతో అభిమానంగా పిలిచినా అది మనకి నచ్చదాయే. కానీ ఏమీ చేయలేని పరస్థితి. దాంతో కొంతమంది దుర్మార్గపు సహాధ్యాయులు కూడా ఇంటి పేరుతో పిలవటం మొదలుపెట్టారు. కొంత దౌర్జన్యం చేసి వాళ్ళను అదుపులోకి తేగలిగాను కానీ నాలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. నాపేరుకి ఒక ప్రత్యేకత తేవాలనే సంకల్పంతో ఆలోచించీ, చించీ Venu ని Venhu గా మార్చాను. కాకుంటే స్కూలులో ఉన్నప్పుడు అలా రాయటానికి  సందేహించేవాడిని. కాలేజికి వచ్చిన తరువాత ఇక హద్దే లేకుండా పోయింది. కొంతమంది "వెన్హు" అంటూ వెక్కిరించేవాళ్ళు, కానీ వాళ్ళందరినీ ధృఢచిత్తం తో ఎదుర్కొన్నాను.
హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ ఎటువంటి ఇబ్బందీ లేదు. తమిళనాడు (మథురై) వెళ్ళాక రెండో దెబ్బ తగిలింది. అక్కడ మా బాసు తమిళియన్. "నీ పేరేంటి" అని అడిగాడు. "వేణు" అని చెప్పాను. "ఎన్న వేణుం?" అని కిచ కిచా నవ్వాడు. మొదట అర్థం కాలేదు, తమిళ తంబి (తమ్ముడు) అంటూ ఉంటారు కదా వీళ్ళు ప్రతి ఒక్కరినీ అన్నా అంటు ఉంటారేమో, అలానే నన్నూ "అన్నా వేణూ" అంటున్నాడు అనుకున్నాను. తరువాత తెలిసింది తమిళం లో "వేణుం" అంటే "కావాలీ" అనీ, నా పేరు వేణు అని చెపితే ఏమి కావాలని అని అరవ జోకు వేశాడని. తనని సాంబారులో ముంచాలన్నంత కోపం వచ్చింది. నా పేరు కష్టాలు అంతటితో  అయిపోలేదని  అప్పుడు నాకు తెలియలేదు.
తరువాత బీహార్ (గయా) వెళ్లాను. ఈ బీహార్ వాళ్లకి, బెంగాలీ బాబులకీ "వ" పలకటంలో అంత ఇబ్బంది ఏమిటో కానీ "బ" అని ఉచ్చరిస్తారు. అందమైన నా పేరును కాస్తా "బేణు బాబు" గా మార్చేసారు. ఏదో సినిమాలో "రెహతా థా" అనమంటే "రఘు తాత" అన్నట్లు విశ్వప్రయత్నం చేసికూడా సగం మందిని మార్చలేక పోయాను.
అటుపిమ్మట నా ప్రయాణం మధ్య ప్రదేశ్ వైపు సాగింది. ఎంతో ఉత్సాహంగా ఇండోర్ వెళ్లాను. మూడు నెలల పాటు ఎటువంటి ఇబ్బందీ లేదు. ఒక వారం సెలవు తీసుకొని ఊరికి బయలుదేరాను. మా అకౌంటెంట్ ఇండోర్ నుంచి భోపాల్ కి బస్సు టికెట్ బుక్ చేయించి ఇచ్చాడు. వెళ్లి బస్సులో ఎక్కి కూర్చున్నాను. నా పక్క సీటులో లగేజి పెట్టి ఉంది. ఓ అమ్మాయి, వాళ్ళ ఆంటీ అక్కడే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరిలో ఎవరో అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాను. ఇంతలో డ్రైవర్ వచ్చి టికెట్ చెక్ చేసి ఇచ్చి వెళ్ళాడు. టికెట్ జేబులో పెట్టుకొంటూ యథాఫలంగా దాని వైపు చూసాను. నా కళ్ళుతో పాటు నోరు కూడా తెరుచుకుండిపోయింది. నాలో టెన్షన్ మొదలయింది. పక్కన ఎవరు కూర్చుంటారో అని భయపడుతూ దేవుడిని ప్రార్థించసాగాను. దేవుడు నా మొర విన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఆంటీకి వీడ్కోలు చెప్పేసి వెళ్లిపోయింది. నా గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే టికెట్ బుక్ చేయటానికి ఫోన్ చేసినపుడు ఆ క్లార్క్ సచ్చినోడు "వేణు" బదులు "రేణు", ఫిమేల్ అని వ్రాసి లేడీస్ ప్రక్కన సీట్ ఇచ్చాడు. పెద్దావిడ కాబట్టి సరిపోయింది. ఆ అమ్మాయైతే అబ్జెక్ట్ చేసేదేమోనని భయపడ్డాను. అదే జరిగితే మన మాట నమ్మేవారా?
చివరగా మహారాష్ట్ర (కొల్హాపూర్) వచ్చిపడ్డాను. ఇక్కడ మరో చిక్కు. వీళ్ళకేమో పూర్తి పేరు చెప్పే అలవాటు. మనమేమో సింపుల్ గా "వేణు" అనేస్తాం. "వేణు మాధవా లేక వేణు గోపాలా?" అంటూ టక్కున అడిగేస్తారు. మనసులోనే పళ్ళు కొరుక్కుంటూ, వాళ్ళ పీక కొరికేసినట్లు ఊహించుకుని ఆనందపడుతూ "వేణు బాబు" అని నవ్వుతూ చెప్పేవాడిని. ఈ మధ్యనే నా బాధలన్నీ తీర్చటానికి ఓ "దేవుడు" దొరికాడు. ఒక రోజు క్లైంట్ ఆఫీసుకు వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తుండగా "వేణూరావ్" అని పిలుపు వినిపించింది. కొంత అనుమానంగా, కొంత ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసాను. నన్నే అన్నట్లు చేయి ఊపుతూ ఒకతను కనిపించాడు. విషయమేమిటంటే తన దృష్టిలో తెలుగు వాళ్ళందరి పేరుల చివరలో "రావ్" తప్పనిసరిగా ఉంటుంది. ఆ దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయింది. అప్పటి నుంచి ఎవరు "వేణు మాధవ్" అన్నా "వేణు గోపాల్" అన్నా కోపమే రావటం లేదు. గొప్ప పేరు తెచ్చుకోవాలంటే కష్టపడాలని తెలుసుగాని అసలు పేరుతో పిలిపించుకోవాలన్నా ఇంత కష్టమని తెలియదు.
కానీ ఒక్కటి మాత్రం నిజం. నా ఫ్రెండ్స్ లో చాలా మంది వాళ్ళ ఫోన్లలో నా పేరు "Venhu" అనే ఫీడ్ చేసుకుంటారు. అది చూసినప్పుడల్లా నా ఛాతి 2 అంగుళాలు పెరుగుతుంది.

Friday, April 1, 2011

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు...!

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు మచ్చుకు కొన్ని.
  • సెలవులేని రోజు  ఇండియా క్రికెట్ మేచ్ ఉండటం.
  • ఇండియా క్రికెట్ మేచ్ మధ్యలో వర్షం రావటం.
  • శనివారం సాయంత్రం బయలుదేరి ఆఫీసు టూరుపై వెళ్ళవలసి రావటం.
  • వరసగా రెండు, మూడు రోజులు సెలవు వచ్చినప్పుడు  ఫ్రెండ్స్ పేకాటకి రాకుండా ఎగకొట్టటం.
  • రాంగోపాల్ వర్మ ఇంకా సినిమాలు తీస్తూ ఉండటం.
  • పండగకి పుట్టింటికి వెళ్ళని భార్య.
కానీ వీటన్నిటినీ మించినది మరొకటి ఉందంటాడు మా ఏకాంబరం.
అదే గడ్డం లోని తెల్ల వెంట్రుకలు. వీటి వలన అస్సలు బద్దకించటానికే కుదరదు. వారానికోసారి కూడా షేవ్ చెయ్యని మావాడి  చేత రోజూ షేవ్ చేయిస్తాయి.

 



Thursday, March 31, 2011

I WISH YOU ALL THE BEST

ఏదో దిగులు. చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఎదురవుతున్న దిగులు. తప్పని సరిగా అనుభవించాల్సి వస్తున్న దిగులు.
అక్క పెళ్లై వెళ్లిపోతున్నప్పుడు, పదవ తరగతి తరువాత నేనూ వెంకటేశ్వర్లు చెరో ఊళ్ళో కాలేజిలో చేరినప్పుడు, కాలేజి తరువాత శీను, నేను చెరో చోట ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, అలానే అబ్దుల్, అవినాష్, హేమంత్ జాబ్ చేంజ్ చేస్తూ వెళ్లిపోయినప్పుడు, వివేక్ ని వదిలి వచ్చినప్పుడు కలిగిన దిగులు. మరలా ఇప్పుడు ఎదురవుతుంది. స్వామి వెళ్లిపోబోతున్నాడు. ఫోన్లోనో, మెయిల్స్ ద్వారానో కాంటాక్ట్ లో ఉంటామని, సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో కలుస్తూనే ఉంటామని తెలుసు. అయినా కానీ మనసు వినదే! 8 గంటలూ తను ఉండడుగా అంటుంది.
మన ఆఫీసుల్లో, ఇంటి దగ్గర ఎందరో పరిచయమవుతుంటారు, పనిమీద మీద ఎందరో కలుస్తూ ఉంటాం. కానీ వాళ్ళలో ఏ ఒక్కళ్ళో ఇద్దరో ఇలా మనసుకి దగ్గరయి ఇబ్బంది(?) పెడుతూ ఉంటారు. ఏమిటీ వీళ్ళకీ మిగిలిన వాళ్లకి ఉన్న తేడా అని అడిగితే ఠక్కున చెప్పాలంటే కష్టమే. పోనీ మనకి నచ్చిన వాళ్ళందరూ ఒకే లాంటి వాళ్ళా అంటే ఊహు! ఎవరికీ వాళ్ళు ప్రత్యేకం. వీళ్ళల్లో ఏ ఒక్కరి మనస్తత్వం మరొకరితో కాదు కదా, కనీసం నాతో కూడా కలవదు. స్వామి వెళ్లిపోతుంటే ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తు వస్తుంది.
VALUE OF RELATION IS NOT THAT HOW MUCH YOU FEEL HAPPY WITH SOME ONE..
BUT IT IS THAT
HOW MUCH SOME ONE FEELS ALONE WITHOUT YOU.
అలా స్వామి నన్ను ఒంటరినీ అనే భావనలో ముంచేసి వెళుతున్నాడు. మళ్ళీ ఇక ఎవరు తోడు దొరుకుతారో. ఏదేమైనా తనకి మంచి అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది.
స్వామీ
I WISH YOU ALL THE BEST.

Saturday, March 26, 2011

మార్చ్

March
ఆర్ధిక సంవత్సరం ముగింపు అంటూ మమ్మల్ని మార్చ్ చేయించింది.
మా పని వేళలు, నిద్రా సమయాలు మార్చేసింది.
మద్యాహ్నం భోజనం చేయాలనే సంగతి మరచి పోయేలా చేసేసింది.
బ్లాగుల నుండి, బజ్జుల నుండి మా దృష్టిని మరల్చింది.
కానీ
ఒక వారం ముందుగానే విజయలక్ష్మి మమ్మల్ని వరించింది.
మా కష్టాలన్నీ మరపించింది, మమ్మల్ని మురిపించింది.

Wednesday, March 23, 2011

ఇట్లు...

ఒరేయ్ శీను,
ఎలాగైనా సరే నీకు ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నానురా. అందుకే గత వారం రోజులుగా నీకు ఫోన్ చెయ్యటం కానీ, నీ ఫోన్ అటెండ్ చెయ్యటం కానీ చెయ్యలేదు. రోజుకి మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఉత్తరంలో వ్రాయటానికి ఏమి ఉంటాయ్? అయినా ఈ మధ్య ఉత్తరాలు వ్రాయటం తగ్గటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఈ-మెయిల్స్, ఫోన్ అందుబాటులోకి రావటం తో పాటు ఏకాంతం తగ్గిపోవటం కూడా ఒక కారణం అనిపిస్తొందిరా! మనకి వొచ్చిన ఉత్తరాన్ని ఎంత వ్యక్తిగతంగా చదువుకుంటామో, ఉత్తరం వ్రాయటానికి అంతకు మించిన ప్రైవసీ కావాలి. అది అయిదు పది నిమిషాలలో పూర్తి కాదు కదా. మధ్యలో ఎవ్వరూ పిలవకూడదు. ఏ ఫోనూ రాకూడదు. అంతెందుకు, టీవీ ముందు కూర్చొని  చదవటం ఎలా కుదరదో ఉత్తరం రాయటం కూడా అలానే కుదరదు. అంతటి ఏకాంతం ఇప్పుడు దొరకటం ఎంత కష్టమో కదా. ఆఖరు సారి నీకు ఉత్తరం వ్రాసి అయిదు సంవత్సరాలు అయిందనుకుంటా. బహుశా అదే నేను వ్రాసిన ఉత్తరమేమో! అందుకే ఇది వ్రాయటానికి మొదటి ప్రేమ లేఖ వ్రాసిన దానికన్నా ఎక్కువ కష్ఠపడవలసి వస్తుంది. మనం పదవతరగతి లో ఉన్నప్పుడు వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది గుర్తుందా? పోస్ట్ కార్డ్ వ్రాస్తే కోర్సుల వివరాలు పంపేది. దానికి వ్రాయటం తో మొదలైన నా ఉత్తరాయణానికి ఇలా అర్దాంతరంగానే బ్రేకు వేస్తాననుకోలేదు. మనం ఉత్తరం మీద హక్కు ఎవరికి ఉంటుందని మనమిద్దరం ఒకసారి వాదనకి దిగాం గుర్తుందా? నీ పెళ్ళికి ముందూ, నేను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నప్పుడూ  నేను నీకు వ్రాసిన ఉత్తరాలు వెనక్కి ఇవ్వమన్నాను. నువ్వేమో అవి నీకు వచ్చిన ఉత్తరాలు ఇవ్వనంటావు. ఆఖరికి ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చి వాటిని తగులబెట్టేసాం. అప్పుడే అర్ధమయింది లవర్సకే కాదు ఫ్రెండ్స్ కి వ్రాసే ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఇంకో విషయం గుర్తొచ్చిందిరోయ్. విషయం పెద్దదిగా ఉన్నప్పుడు పేపరు పై వ్రాసి ఎన్వలోప్ లో పెట్టి పంపేవాడిని గుర్తుందా? ఆ ఎన్వలోప్ కి చాలా పిన్నులు కొట్టేవాడిని (వేరే వాళ్ళు ఎవరన్నా ఓపెన్ చెయ్యాలనుకున్నా విసుగుపుట్టి వదిలేస్తారని). నీకు ఏదో చెబుతామని ఉత్తరం వ్రాయట్లేదు. అందుకే ఏమి వ్రాశానో మరోసారి చదవకుండానే పంపిస్తున్నాను. ఇకపై ఈ పరంపర ఆగదురోయ్. నీ జవాబుకై (అంటే నేనోదో ప్రశ్నలు అడిగానని కాదు, నీ ప్రత్యుత్తరం కోసం) ఎదురు చూస్తుంటాను.
ఇంతే సంగతులు
ఇట్లు
పూరేటి వేణు బాబు వ్రాలు.

Thursday, March 17, 2011

అరువు ఇవ్వబడదు.

పుస్తకాన్ని అరువు ఇవ్వకూడదని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమయింది. మనం ఎంతో ఇష్టంగా పుస్తకం కొనుక్కుంటామా, చటుక్కున అడిగేస్తారు ఇవ్వరా చదివిస్తాను అని. ఇవ్వనూ అనటానికి మొహమటమాయే. చదువుకొని చెక్కు చెదరకుండా తెచ్చిస్తే ఇబ్బందే లేదు. కానీ చాలా మందికి తీసుకు వెళ్ళటం లో ఉండే ఉత్సాహం తెచ్చివ్వటం లో కాదు కదా కనీసం చదవటం లో కూడా ఉండదు. మొన్న ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లాను. వాళ్ళు పాత పేపర్లు తూకానికి వేసే పనిలో ఉన్నారు. ఆ సముద్రంలో నుంచి వాడు ఎప్పుడో ఆరు నెలల క్రితం నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళిన "పాణిగ్రహణం" బయట పడింది. తీసుకొని చూస్తే అట్ట సగం చిరిగి పోయి ఉంది. వాళ్ళ చిన్న పాప రైటింగ్ ప్రాక్టీస్ చేసిందనుకుంటా. కొన్నిపేజీలలో పిచ్చి గీతాలు ఉన్నాయి. అట్ట వెనుక నోట్ చేయబడిన కొన్ని ఫోన్ నెంబర్లు, ఎక్కడ వరకూ చదివారో గుర్తుగా మడిచిన పేపర్లను చూస్తే మండుకొచ్చింది. ఆ పుస్తకం తలరాతో, నా అదృష్టమో బాగుండి పేపర్ల క్రింద పడిపోయి పుస్తకం బతికి పోయింది కానీ లేకుంటే ఇంకా దారుణంగా తయారయ్యేది అనిపించింది. కాసేపటి తరువాత పుస్తకం తీసుకొని బయలు దేరాను. "ఉంచరా, పూర్తిగా చదివిస్తాను" అన్నాడు. కొరకొరా చూసి పుస్తకం తీసుకొని వచ్చేసాను.
పుస్తకాలంటే చాలామందికి లక్ష్యమే ఉండదు. చదివిన పేజీ గుర్తు పెట్టుకోవటానికి ఆ పేజీ మడత పెడతారు. దానివలన అక్కడ చిరిగి పోతుంది. లేదా చదువుతూ చదువుతూ పుస్తకం గుండెల మీదో, ముఖం మీదో పెట్టుకొని నిదుర పోతారు. దీనివలన కింద పడో, చమట పట్టో పుస్తకం చిరిగి పోయే అవకాశాలు ఎక్కువ. నేను ఎక్కువ మల్లాదివెంకటకృష్ణమూర్తి పుస్తకాలే ఎక్కువ కొంటూ ఉంటాను. వీటితో వచ్చిన చిక్కేంటంటే ఇవి సెకండ్ హేండ్ మార్కెట్ లో దొరకటం చాలా అరుదు. ఏ వీక్లీనో, మంత్లీనో అయితే ఫరవాలేదు. సాధారణంగా వాటిని చదివి పక్కన పడేస్తుంటాం. కానీ ఒక పుస్తకం కొన్నామంటే అది దాచుకోతగినదనే కదా. పక్కవాళ్ళ వస్తువుపై ఆమాత్రం జాగ్రత్త లేకుంటే ఎలా? అందుకే తీవ్రంగా నిర్ణయించుకున్నాను "ఇకపై పుస్తకాలు ఎవరికీ అరువు ఇవ్వకూడదనీ."

Wednesday, February 9, 2011

శంకర్ దాదా B. Tech

శంకర్ దాదా సినిమాలో పేషెంట్లను స్వంత మనుషులులా భావిస్తే వైద్యం చేయలేమని చెప్పే సన్నివేశముంది. తరువాత అది తప్పని నిరూపిస్తారనుకొండి. ఇలా భావించే డాక్టర్లే కాదు, ప్రాజక్ట్ మేనేజర్లు కూడా ఉంటారు. ఎంత సేపు ఎంత టార్గెట్, ఎచీవ్మెంట్ ఎంత అనే తప్పితే వీరి నోటి  వెంట మరో మాటే రాదు. ఖర్మకాలి వీళ్ళతో కలిసి భోజనం చేయవలసి వచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళ వలసి వచ్చినా ఇఖ చూసుకోండి, నరకమే. వర్క్ గురించే మాట్లాడుతారు తప్పితే మరో మాటే ఉండదు. ఏమన్నా వ్యక్తిగత విషయాలు చర్చిస్తే చంకనెక్కుతారని భయమేమో కానీ చాలా మందిది ఇదే పద్ధతి.

మా దగ్గర పనిచేసే ఒక సీనియర్ ఇంజినీర్ రాజీనామా చేసినప్పుడు కారణం అడిగితే ఈవిధంగా చెప్పాడు. "మన దగ్గర కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఫర్లేదు, కానీ డిపార్ట్మెంటల్ లేబర్ పనిచేస్తుంటే ఉదయాన్నే 8 గంటలకల్లా సైట్ కి వెళ్ళాలి, క్లైంట్ తో మాట్లాడాలి. సాయంత్రం వరకు ROW ప్రాబ్లమ్స్ తీర్చుకుంటూ పని చేయించాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ, వోచర్లు రాసుకుంటూ కూర్చోవాలి. మా ఇంట్లో వాళ్ళు "నువ్వు కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నావా లేక ఎవరన్నా కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా పని చేస్తున్నావా" అని అడుగుతున్నారు. పైగా ఒక్కరూపాయి తేడా లేకుండా వ్రాసినా కూడా అకౌంటెంట్ దొంగలను చూసినట్లు చూసే చూపులను భరించాలి. కారణాలతో సంభందం లేకుండా అచీవ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడే బాసుల దగ్గర తిట్లు తినాలి. ఆదివారం కూడా సెలవు తీసుకోవటానికి వీలులేని జీవితం సార్. నావల్ల  ఎవరూ తృప్తిగా లేనప్పుడు నేను ఎందుకు పని చేస్తున్నానో, ఎవరికోసం పని చేస్తున్నానో అర్థం కావటం లేదు. ఇక్కడ ఉండి పిచ్చివాడిని అయ్యేకంటే వెళ్లిపోవటమే నయమని వెళ్ళిపోతున్నాను"  అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఈ ఒక్క సంఘటనే కాదు, ప్రాజెక్ట్ లలో పనిచేసేవాళ్ళని చాలామందిని గమనించాను. కొంతమంది ఎక్కువ జీతం వస్తుందనో, ప్రమోషన్ కోసమో లేక వ్యక్తిగత కారణాల వలనో మానేసినా ఎక్కువమంది మాత్రం గుర్తింపు దొరకక పోవటం, మానసిక ఒత్తిళ్ళు వలనే మానేశారు. 
క్లైంట్ ఎంత  అడ్డదిడ్డంగా మాట్లాడినా చిరునవ్వుతో వినే మేనేజర్ తన క్రింద ఉద్యోగి చెప్పేది వినటానికి కూడా అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఎందుకని? అందుకే నాకు అనిపిస్తుంది "ఒక మేనేజర్ కి  టెక్నికల్ గానో, క్లైంట్ డీలింగ్ లోనో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. తన దగ్గర పనిచేసేవారి సాదకబాధకాలు కూడా అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి."

Wednesday, February 2, 2011

వింత సమాధానాలు

చిన్నప్పుడో ఎప్పుడో ఒక అక్బర్ బీర్బల్ కథ చదివాను. ఒకసారి అక్బర్ " నీవు ఏదోవొక పనిచేసి నన్ను ఆశ్చర్య పరచాలి, దానికి నేను అడిగే ప్రశ్నకు నువ్విచ్చే సమాధానం నన్నింకా ఆశ్చర్యపరచాలి" అని బీర్బల్ తో చెపుతాడు. రెండురోజుల తరువాత అక్బర్ ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు బీర్బల్ వెనుకగా వెళ్లి నడుముపై గిల్లుతాడు. అక్బర్ ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలగగా "బీర్బల్, ఏమిటీ నువ్వు చేసిన పని?" అని అడుగుతాడు. "క్షమించండి మహారాజా, మీరనుకోలేదు. మహారాణీ వారనుకున్నాను" అనేది బీర్బల్ ప్రత్యుత్తరం.
ఇలాంటి సమాధానాలు ఇచ్చేవారు నిజంగా కూడా ఉంటారని నిన్నే తెలిసింది. జీతం తీసుకున్న ఆనందంలో నేను, స్వామి రాత్రి హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యాని ఆర్డర్ ఇచ్చాం. సప్లయర్ బిర్యానీతో పాటుగా టమాటా, నిమ్మకాయ మరియు ఉల్లిపాయ ముక్కలు తెచ్చిచాడు. ఉల్లిపాయ ముక్కలు నల్లగా ఉండటం గమనించి "ఇవి నిన్న కట్ చేసినవిలా ఉన్నాయి, తాజావి తీసుకురా" అని స్వామి చెప్పాడు. లేదు అవి ఇప్పుడు కోసినవే అని వాడు అడ్డంగా మాట్లాడాడు. "ఈముక్కలు ఇంత నల్లగా ఉంటే ఇప్పుడుకోసినవంటావేం" అంటూ నేను కలిపించుకున్నాను. వాడు ఒక్కసారిగా ఎంతో రిలీఫ్ గా నిట్టూర్చి "ఓహ్ అదా సార్, కత్తికి ఉండే తుప్పు సార్" అంటూ అసలు సంగతి చెప్పాడు. వాడి నిజాయితీకి మెచ్చుకోవాలో, చాచిపెట్టి ఒకటి కొట్టాలో అర్థం కాలేదు. చికెన్ గురించి అడిగితే ఇంకా ఏ కఠోర సత్యాలు వినవలసి వస్తుందో అని గప్ చుప్ గా తినేసి వచ్చాం.

Monday, January 31, 2011

విజయ దరహాసం

ఇది మేము పదవ తరగతి ఆఖరు పరీక్షలు రాసేటప్పటి సంగతి. మా ఊళ్ళో పరీక్షాకేంద్రం లేదు. 8 కి.మీ. దూరంలో ఉన్న మండలకేంద్రంలో పరీక్షలు వ్రాయాలి. బస్ సమయానికి లేనందున ఆడపిల్లలికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్టర్ వాళ్ళని ఎక్షామ్ కి తీసుకువెళ్ళి మరలా తీసుకు వచ్చేది. మగపిల్లలమందరం ఎవరి సైకిళ్ళపై వాళ్ళు, సైకిల్ లేనివాళ్ళు పక్కవాళ్ళ సైకిల్ పైనా వెళ్ళే వాళ్ళం ఒక్క మా గణపతి తప్ప. (అది మావాడి ముద్దు పేరు. గణపతి / గణపయ్య / గణేష్ మొదలైనవి కూడా). వాళ్ళ నాన్న మాత్రం వాడిని ట్రాక్టర్లో వెళ్ళే పనైతేనే ఎక్షామ్స్ కి వెళ్ళు లేకుంటే మానేయమన్నాడు.
పైగా డ్రైవర్ పక్కన కూడా కూర్చోవటానికి వీల్లేదు. తొట్టిలో బాసింపట్టు వేసుకు కూర్చోవాల్సిందే. అప్పుడే మీసాలు వస్తున్న రోజులాయె. ఆడపిల్లలతో కలిసి వస్తున్నందుకు వాడిని విపరీతంగా ఏడిపించేవాళ్ళం. వాడు వాళ్ళ  నాన్నని  ఎంత బతిమిలాడినా ఊహు వినిపించుకోడే. ఇలానే 10  పరీక్షలు అయిపోయాయి. ఆరోజు ఆఖరి పరీక్ష. అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నాం. మరో పది నిమిషాలలో ట్రాక్టర్ కూడా వచ్చింది. కానీ అందులో మాగణపయ్య లేడు. ఏమయ్యాడా ఏమయ్యాడా అనుకుంటుండగా వాడు సైకిల్ పై వచ్చి మాముందు దిగాడు. అప్పుడు వాడు నవ్విన నవ్వు చూస్తే వాడి పెదవులు, కళ్ళు, కనుబొమ్మలు, ముఖమే కాదు ఆఖరి వాడి చెవులు (?) కూడా నవ్వాయనిపించింది.( ఆసాయంత్రం వాళ్ళ నాన్నగారు వాడిని అరగంట సేపు దీవించిన సంగతి తరువాత తెలిసిందనుకొండి)  

ఇప్పటికీ ఈవిషయంపై వాడిని ఏడిపిస్తూనే  ఉంటాం, వాళ్ళ నాన్నని అడుగుతూనే ఉంటాం "ఎందుకు బాబాయి వాడిని సైకిల్ పై  పంపలేదు" అని. ఇద్దరూ నవ్వేసి ఊరుకుంటారంతే. 
సెలవు దొరకక పోవటం వలన గత సంవత్సరం వాడి పెళ్ళికి కూడా వెళ్ళలేక పోయాను. ఇద్దరి సెలవలు మాచ్ కాకపోవటం వలన కలిసి కూడా చాలా రోజులయింది.
గణపతి ఐ మిస్ యు రా. (సారీరా నీ అనుమతి లేకుండా వ్రాసాను. అయినా అడిగితే నువ్వు ఒప్పుకుంటావా ఏమిటి?)

ప్రేమతో
వేణుబాబు పూరేటి

Friday, January 28, 2011

తక్కువ ధరకు సరుకులు (వెచ్చాలు) కొనే చిట్కా... (ఒక యదార్థ సంఘటన ఆధారంగా)

నిన్న మాకొలీగ్ తో పాటు సరుకులు (వెచ్చాలు) కొనటానికి వెళ్లాను. అక్కడ మేము వెళ్ళేసరికే కొంతమంది సరుకులు కొంటున్నారు. వాళ్ళు వెళ్ళిన తరువాత మావాడు సరుకులు, కూరగాయలు తీసుకొని ఖాతాపుస్తకంలో వ్రాయించుకున్న తరువాత వచ్చేశాం. మిగిలిన వాళ్ళ కన్నా మావాడికి తక్కువ రేటు వేయటం గమనించి విషయమేమిటని అడిగాను.
మావాడు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న నాలుగైదు షాపులలో రెక్కీ నిర్వహించి ఈషాపు ఎంచుకున్నాడు. ఒకానొక శుభముహూర్తాన షాపు రద్దీగా ఉన్నప్పుడు వెళ్లి ఏవేవో కొని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు 35రూపాయలు పోనూ మిగిలిన 65రూపాయలు తిరిగి ఇచ్చేసారు. మనవాడు ఒక చిరుదరహాసం చేసి "రేపటి నుండి మీ షాపుకే వస్తాను, నేను 50రూపాయలు ఇస్తే సరుకులు ఇచ్చి మరీ 65రూపాయలు చిల్లర ఇచ్చే మరోషాపు దొరకదంటూ" 50రూపాయలు తిరిగి ఇచ్చేసాడు. (నిజానికి మనవాడు ఇచ్చింది 100 రూపాయలే).  ఆవిధంగా 50రూపాయలు రిస్క్ చేసి మనవాడు వాళ్ళ దృష్టిలో రాముడు మంచి బాలుడు అన్నట్లు ముద్ర పడిపోయాడు. పైగా ఇక్కడి వాళ్లకు తెలుగువాళ్ళు అంటే సాఫ్ట్ కార్నర్, దానికి తోడు మనవాడు కూడా స్వామి లాగానే అందరినీ అక్క, అన్నా అంటూ అల్లుకు పోతాడు. ఒకటో తారీఖే SBI ATM లో నుంచి తీసిన కొత్త నోట్లతో బాకీ తీర్చేస్తాడాయే. అలా గత ఒకటిన్నర సంవత్సరాల నుండి ప్రతిదాంట్లో రూపాయి రెండు రూపాయలు చొప్పున లబ్ది పొందుతూనే ఉన్నాడు. మనవాడు వాళ్ళను ఏవిధంగాను మోసం చెయ్యలేదు కనుక ఇది తప్పాఒప్పా, నైతికమా అనైతికమా తేల్చుకోలేక పోయాను కానీ వాడి (అతి) తెలివితేటలను మాత్రం మెచ్చుకోక తప్పలేదు.
మీరు కూడా ఈ అద్భుతమైన (పనికిమాలిన) చిట్కాని పాటించి లాభం పొందగలరు.
షరా: ఎవరన్నా దుకాణదారులు (షాప్ కీపర్స్) కనుక ఈ టపా చదివి ఉంటే వెంటనే మరచిపొమ్మని మన్నవి.

Thursday, January 27, 2011

ఎవరు గొప్ప?

మంచుపల్లకి గారు కొంచెం గౌరవం ? లో రైతుల గురించి, సైనికుల గురించి చాలా బాగా వ్రాసారు. దీనిపై కొనసాగిన సుదీర్ఘమైన చర్చలో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నపుడు ప్రత్యేకంగా కొంతమందికి పనికట్టుకొని గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదని, దీనికన్నా ప్రమాదకరమైన / భరోసాలేని ప్రతిఫలం వచ్చే / గౌరవ ప్రదమైన వృత్తులు చాలా ఉన్నాయని కొందరు వాదించారు. మంచుపల్లకి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఒక్క ఈ క్రింది విషయం లో తప్ప.
కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత,  నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు.... ఇంకా ఏదో కావాలి... దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ... అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే.....   
1. వీధులు ఊడవటానికి వచ్చేవాళ్ళకి చూడండి ఏమన్నా పెట్టివ్వాలంటే కవర్ లో వేసిస్తారు తప్పితే (అది వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళటానికి అనుకోండి) వాళ్ళు తినటానికి ప్లేటులో పెట్టి ఇచ్చే వాళ్ళు బహు అరుదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి మన దృష్టిలో గౌరవ ప్రదమైనది కాదు. (బహుశా ఈమాట చేదుగా అనిపించవచ్చు)
2. మనం ప్రయాణిస్తున్న బస్సు ఏ అర్ధరాత్రో ఎక్కడో ఆగిపోయిందనుకోండి. కండక్టర్ ఆ దారిలో వెళ్ళే మరో బస్సును ఆపి మనల్ని ఎక్కించేంత వరకు టెన్షన్. RTC ని (బూతులు) తిట్టుకుంటూ ఉంటాం. మరో బస్సు రాగానే హడావుడి గా ఎక్కేస్తాం. మెకానిక్కులు వచ్చేంతవరకు అక్కడే ఎదురు చూసే డ్రైవర్, కండక్టర్ ల గురించి అస్సలు పట్టించుకోం. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. అంతే!
3. మా ఫ్రెండ్ వాళ్ళ బాసు ఉండేవాడు. శుక్రవారం సాయత్రం 6.30 కి ఫోన్ చేసి సోమవారం ఉదయం క్లయింట్ తో మీటింగ్ ఉంది, అర్జంట్ గా రిపోర్ట్ లు కావాలనే వాడు. రాత్రి 11 గంటల వరకు ఒక్కడే కూర్చొని రిపోర్ట్ తయారు చేసి పంపేవాడు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫోన్ చేస్తాడు రిపోర్ట్ పంపావా అని. అంటే శనివారం,ఆదివారం కనీసం మెయిల్స్ కూడా చూడలేదన్నమాట. అటువంటప్పుడు అంత అర్జంట్ అని చెప్పవలసిన అవసరం ఏముంది? శనివారమో, ఆదివారమో ఉదయం వచ్చికూర్చోని చేసిస్తాడు కదా? ఉద్యోగస్తులందరూ వర్షం వస్తే బజ్జీలు తిందామనుకునే పరిస్థితిలో ఉండరండీ. రోజంతా కాంక్రీట్ గోడల మధ్యో, ఇనుప యంత్రాల మధ్యో పనిచేస్తూ సాయంత్రం బయటికి వచ్చి అరె! వర్షం పడిందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్యూషన్ నుంచి పాపను ఇంటికి తీసుకు వెళ్ళాలి, లేదా భార్యనో పాపనో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, బాసు రిపోర్ట్ అర్జంట్ అంటాడు, లేదా ఏ మీటింగ్ మధ్యలోనో ఉంటాం, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. భార్యని వెళ్ల మందామంటే తనకు భాష సమస్య. మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు ఒకటో తారీఖే జీతం రావచ్చు కాక, కానీ తృప్తి మనశ్శాంతో? సైన్యం లో ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో ఇంటికి వెళ్ళవచ్చు. కానీ సాధారణ పరిస్థితులలో సెలవుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో సెలవు తీసుకోవటానికి భగీరథ యత్నమే చెయ్యాలి. మన అకౌంట్ లో CL, SL, EL అన్నీ ఉంటాయి. కానీ సెలవు అడిగితే ఎందుకు అంటారు. అంతే బాసుల ఉద్దేశంలో ఎవరన్నా చస్తేనో (సారీ కోపం ఆపుకోలేను), ఎవరిదన్నా పెళ్లుంటేనో (అదీ స్వంత ఇంట్లోనే సుమా, బంధువులది, స్నేహితులదీ చెల్లదు) తప్ప సెలవు తీసుకో కూడదా?
4. అ. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి చెముడు, శ్వాసకోశ వ్యాధులు
    ఆ. వడ్రంగి, కట్టెల అడితిలో పనిచేసే వారికి ఊపిరితిత్తులకు సంభందిచిన జబ్బులు 
   ఇ. ఇస్త్రీ చేసేవారికి, కొలిమి దగ్గర పంచేసే వారికి అల్సర్
   ఈ. నేర పరిశోధన శాఖలో చేసేవారు కనీసం వెళుతున్నారో ఎక్కడకు కనీసం ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితి. ఖర్మకాలి ఏమన్నా అయితే కనీసం శవమన్నా దొరుకుతుందో లేదో అనుమానమే.
ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి వృత్తిలోనూ ఏదో ఒక ప్రమాదం లేదా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. వీటికి తోడు మహిళా ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను నేను చర్చించనే లేదు. మరి వీళ్ళెవ్వరిలోనూ రైతులలోనో, సైనికులలోనో ఉండే ఆ ఇది లేదంటారా?

కొంతమంది తమకు నచ్చిన పనిని వెదుక్కొని దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొన వచ్చుగాక. కానీ ఎక్కువమంది మాత్రం తమకు అందుబాటులో ఉన్న, తమకు తెలిసిన, తము చేయగలిగిన / చేయాల్సి వచ్చిన పనులను మాత్రమే ఎంచుకుంటారు / చేస్తుంటారు. ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తున్నారు అనిగాక పనిలో వాళ్ళు చూపే నిబద్దతని బట్టి గౌరవం ఇవ్వాలి అంటాను.
కొంచెం గౌరవం ?   పై జరిగిన చర్చలో అసందర్భంగా హిందూ ముస్లింలపై కూడా కొన్ని వ్యాఖ్యలు పడ్డాయి. దీనిపై నా అభిప్రాయం మరో టపాలో తెలియచేస్తాను.
ఇట్లు
వేణు బాబు పూరేటి (కొన్ని స్వామి సలహాలతో)

Wednesday, January 26, 2011

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా....

మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 
నాకు కొన్ని SMS లు వచ్చాయి. వాటిలో ఒకటి ఈ క్రింద వ్రాస్తున్నాను.
Buland Bharat ke nikkamme baccho,
 valentines/frndship day hota to ab tak 100 sms ho gaye hote.
 But why so less SMS today ?
Its Republic Day.. 
spread the word of patriotism
So wish evrybody…
చూడగానే చిర్రెత్తుకొచ్చే SMS. ఈ SMS పెట్టి వాళ్లకు వాళ్ళు దేశభక్తులు అనుకుంటారేమో! ఇలాంటి వాళ్ళలో ఎంతమంది జెండా ఆవిష్కరణకి హాజరవటం కానీ, తమ ఇంటి దగ్గర, ఆఫీసులో అందరికీ శుభాకాంక్షలు చెప్పటం, ఫోన్ బుక్ లో ఉన్న అందరికీ SMS లు పంపటం చేసి ఉంటారు! అసలు అది సాధ్యమేనా? ఏమన్నా అంటే సరదాగా పంపాను, నీకు సెన్సాఫ్ హ్యూమర్ లేదు అంటారు. సరాదాకి టాపిక్ తోనూ ఎదుటి వారి ఫీలింగ్స్ తోనూ సంభందం లేదా? ఉదయాన్నే ఇలాంటి SMS చూడగానే మూడ్ అంతా పాడవుతుంది. దయచేసి ఇటువంటి SMS లు ముఖ్యంగా మరో పదిమందికో, ఇరవైమందికో ఫార్వార్డ్ చెయ్యమనే SMS లు మెయిల్స్ పెట్టకండి.
.

Monday, January 24, 2011

కుక్కర్ మూత తీయటం ఎలా?

ప్రెషర్ కుక్కర్ మూత తీయటం ఎలా అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ చాలాకి అందరికీ మధ్య చాలా తేడా ఉండనే విషయం గత వారం మా కొలీగ్ కుక్కర్ మూత బలవంతం గా తీసి ముఖం కాల్చుకున్నప్పుడే అర్థం అయింది. అతనిని హాస్పిటల్ లో చేర్పించిన తరువాత కుక్కర్ గురించి మా మిత్రబృందం మధ్య జరిగిన చర్చ సారాశం వ్రాస్తున్నాను.
1. కుక్కర్ సామర్ధ్యాన్ని మించి అందులో పదార్థాలు వేయరాదు.
2. గేస్కేట్ ఖచ్చితంగా పెట్టవలెను.
3. వండే పదార్థాన్ని బట్టి ఎన్ని నీళ్ళు పోయాలి, ఎన్ని విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి మొదలైనవి తెలుసుకొని వంట చేయాలి తప్పితే ప్రయోగాలు చేయరాదు.
4. స్టవ్ ఆపిన తరువాత ప్రెషర్ అంతా పోయిందని నిర్థారించుకున్న తరువాత లేదా రిలీజ్ చేసిన తరువాత మాత్రమే మూత తీయాలి.
కనుక ఫ్రెండ్స్ (ముఖ్యంగా స్వయంపాకం చేసుకునే మగ మిత్రులారా) తస్మాత్ జాగ్రత

Friday, January 14, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు.

బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రేమతో
వేణు బాబు పూరేటి

Wednesday, January 12, 2011

సరైన దిశలో తెలంగాణా కాంగ్రెస్...

టి.ఆర్.ఎస్. మొదట నుండి తెలంగాణా కావాలని పట్టు పట్టింది.
బి.జే.పి. కూడా దానికి మద్దతు తెలిపింది.
తెలంగాణా లో ఎటువంటి బలము లేని పి.ఆర్.పి. సమైఖ్య ఆంధ్రా కి మద్దతు తెలిపింది.
కానీ ఈ విషయం పై కాంగ్రెస్, టి.డి.పి.లు మాత్రమే గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తూ వచ్చాయి. టి.డి.పి. ప్రతిపక్షం లో ఉండటం వలన అది మద్దతు తెలిపినా తెలపక పోయినా వచ్చే తేడా పెద్దగా ఏమీ లేదు. తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని బీరాలు పలికిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం ధోరణి కొరుకుడు పడటంలేదు. మొదట శ్రీ కృష్ణ కమిటీ అనీ, తరువాత రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉంది. దీనితో ఇప్పటి వరకు అధిష్టానం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఎదురు దాడికి దిగటం మొదలు పెట్టారు. జగన్ కి మద్దతు తెలుపుతున్న ఎం.ఎల్.ఏ. లను ఉదహరిస్తూ ఒక వ్యక్తి కోసం 24 మంది రాజీనామా చేయటానికి సిద్ధపడితే 4 కోట్ల మంది కోసం మేము రాజీనామా చేస్తే తప్పేంటి అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మీడియా ముందు డ్రామా చేయటానికి కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై ఇదే విధం ఒత్తిడి తెస్తేనే ఈ దీర్ఘ కాలిక సమస్యకు ఏదో ఒక పరిష్కారం, కనీసం పరిష్కారం దిశగా తొలి అడుగైనా పడుతుంది.

ప్రాధమిక విద్య కాదు మిథ్య.

నాకు ఎలాగు సంక్రాంతికి సెలవు దొరక లేదు. సరే మన మిత్రబృందం సెలవుల్లో ఏమి ప్లాన్ చేస్తున్నారో అని అందరికి ఫోన్ చేయటం మొదలు పెట్టాను. మొట్టమొదట ఇటీవలే ప్రాధమిక పాఠశాల లో అయ్యవారిగా ఉద్యోగంలో చేరిన మా నాసరరావుకి ఫోన్ చేసాను. "ఏరా సెలవుల్లో ఏమి చెయ్యాలనుకున్టున్నావు" అని అడిగాను. "మీకైతే ఎప్పుడో ఒకసారి సెలవలు కనుక ప్రత్యేక ప్రోగ్రాంలు ఉంటాయి, మాకు రోజూ సెలవు కింద లెక్కే" అన్నాడు. నాకు అర్ధంకాక "అదేమిటిరా, కొంపదీసి ఉద్యోగం మానేశావా ఏమిటి" అని అడిగాను. "అదేమీ లేదు మామా! మా స్కూల్ లో విద్యార్థుల సంఖ్య తక్కువ కదా అందుకని రోజంతా ఖాళీయే" అని వాళ్ళ స్కూల్ కథ చెప్పటం మొదలు పెట్టాడు.
ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం 30 మంది విద్యార్థులకి కనీసం ఒక అయ్యవారు ఉండాలట. కానీ మనవాళ్ళు ఒక అయ్యవారికి 30 మంది విద్యార్థులు ఉన్నట్లు (రిజిస్టర్ లో) చూపిస్తారట. మనవాడు చేరక ముందు ఆ బడిలో ముగ్గురు అయ్యవార్లు నిజంగాను, 100 మంది విద్యార్థులు రికార్డ్ ప్రకారం గానూ (నిజానికి 40 మందే) ఉన్నారట. మనవాడి వంతు 15 మందిని అప్పచెప్పారట (జూనియర్ కదా). "ఏరా మరి మీకు ఇన్స్పెక్షన్లు ఏమీ ఉండవా?" అని అడిగాను. నన్ను వెర్రివాడిలా చూసి "ఇది అందరికీ తెలిసిన నగ్నసత్యమే మామా, మేనేజ్ అయిపోతుంది" అని గీతోపదేశం చేసాడు. వాళ్ళ జీతాలు వినేసరికి నా కళ్ళు పచ్చబడ్డాయి. ప్రధానోపాధ్యాయుని జీతం 28 వేలు, వేరే అయ్యవారి జీతం 27 వేలు, అమ్మవారి జీతం 20 వేలు, మావాడి జీతం 3.5 వేలు. మొత్తంగా 78.5 వేలు. అనగా ఒక్కొక్క విద్యార్ధికి (అ ఆ లు నేర్చకునే పిల్లలతో సహా) మనం నెలకి కడుతున్న ఫీజు సగటున రు. 1962 /- (అక్షరాల ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు మాత్రమే). "మన ఊళ్ళో మరో మూడు ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి కదా వాటితో పాటు కలిపివేయవచ్చు కదా" అన్నాను. "మొదటి నుంచి ఊళ్ళో ఉన్నది కాక ఒకటి ST కాలనీలో, ఒకటి SC కాలనీలో, మరోటి BC కాలనీలో ఉన్నాయి. అవి పెట్టినప్పుడు విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. కానీ క్రమేణా ప్రవేటు స్కూళ్ళ సంఖ్య పెరగటం తో వీటిలో విద్యార్థుల సంఖ్య తగ్గటం మొదలయింది. నాలుగు పాఠశాలల మీద కలిపి విద్యార్థుల సంఖ్య 86 మాత్రమే. (రిజిస్టర్ లో 100+45+35+25 = 205 అనుకో). కానీ అయ్యవార్లు మాత్రం 9 మంది ఉన్నారు. నిజానికి విద్యార్దులనందరినీ ఒకటీ లేదా రెండు చోట్లకి గనుక చేరిస్తే ముగ్గురు లేదా నలుగురు అయ్యవార్లు సరిపోతారు. కానీ ఏ రెండు చోట్ల నుంచి  పాఠశాలలను తరలించాలనేదే పెద్ద సమస్య. ఎక్కడ నుంచి పాఠశాలను తీసివేసిన అది ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు అంటేనే కుల రాజకీయాలు అనే చందాన తయారయ్యాయి" అన్నాడు.
ఇలాంటి బళ్ళు ఒక్క మా ఊళ్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా ఉన్నాయి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎక్కువ చోట్ల మాత్రం ఇదే పరిస్థితి. మన నాయకులు కులాల ప్రకారం జనగణన జరపాలా వద్దా అని ఆలోచించే దానిలో ఒక వంతైనా ఈ విషయం పై దృష్టి సారించి నిజమైన విద్యార్థుల సంఖ్యను గుర్తిస్తే, ఇప్పుడు ప్రాధమిక విద్య పై పెడుతున్న ఖర్చుతో మరింత మెరుగైన (అన్ని మౌలిక సదుపాయాలు కల) పాఠశాలలను, విద్యను అందించ వచ్చు.

Monday, January 10, 2011

ప్చ్... సెలవు దొరకలేదు.

దీపావళి వచ్చి వెళ్ళిన దగ్గరి నుండి సంక్రాంతి కోసంఎదురు చూస్తున్నాను. మా నార్త్ ఇండియా కొలీగ్స్ అందరూ దీపావళి సెలవలకు వెళుతుంటే చెప్పాను "పొండిరా పొండి, నేను సంక్రాంతి వెళతాను" అని. నెల రోజుల ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్నాను. నెలాఖరు ఒత్తిళ్ళు, నెల మొదట్లో ఉంటే ప్లానింగ్ లు అన్నీ అయిపోతాయీ, సెలవు ఖచ్చితంగా దొరుకు తుందని ఎంతో ధైర్యంగా ఉన్నాను. కానీ మా బాసాసురుడు Q1 & Q2 లో కూడా మన పెర్ఫామెన్స్ బాలేదు, Q3 లో ఎవరికీ సెలవలు లేవు అని చెప్పి నా నెత్తిపై పెద్ద బండ వేసాడు. నెలరోజుల ముందునుంచి బ్యాగులు సర్దుకు కూర్చున్న మా హోం మినిస్టర్ ఎలా అర్థమయ్యేలా / సర్ది చెప్పను!?

Tuesday, January 4, 2011

సంతూర్ vs జగన్

కొన్నాళ్ళ క్రితం సంతూర్ ఏడ్ వచ్చేది. ఒకామె ఎక్సర్సైజ్ చేసి వస్తుండగా వేరే ఒకరు పలకరిస్తారు "ఎక్స్ క్యుజ్ మీ, మీరు ఏ కాలేజ్" అని. ఈ లోగా ఓ పాప వస్తుంది "మమ్మీ" అనుకుంటూ. ఈ ఏడ్ ఎంత పాపులర్ అయిందంటే మా కాలేజ్ రాగింగ్ లో పాటలకు డాన్స్ వేయించే బదులు ఈ ఏడ్ మా చేత ప్రదర్శింప చేసేవారు. ఇప్పటికీ సంతూర్ వాళ్ళు ఆ "మమ్మీ" కాన్సెప్ట్ నుంచి బయట పడలేక పోతున్నారు. ప్రస్తుతం సంతూర్  ఏడ్ లో ఒకామె జనాన్ని నెట్టుకుంటూ మెట్లు ఎక్కుతుంది (ఏ మాత్రం సెన్స్ లేకుండా). వాళ్ళే తన గదిలోకి వస్తారు. కనీసం కూర్చోమని కూడా అనకుండా (ఎంత పెద్ద పదవిలో ఉన్నా తనకు అసలు మర్యాద అనే పదానికి అర్థమే తెలియనట్లు) డైరెక్ట్ గా విషయం లోకి వచ్చేస్తుంది. ఈలోగా ఓపాప మళ్లీ "మమ్మీ" అనుకుంటూ ఎంటరైపోతుంది.(ఏ మీటింగ్ జరుగుతుంటే మాత్రం తనకేం, ముందే చెప్పుకున్నాం కదా మర్యాద అనే మాట మన డిక్షనరీ లోనే లేదని). ఇవన్నీ చూపించాలంటే 3 గంటల సమయం కావాలని వాదించే వాళ్ళు ఉండవచ్చు. కానీ సంతూర్ వాళ్ళు "మమ్మీ" మత్తు లోనుంచి బయటకు వస్తే ఇంకా మంచి కాన్సెప్ట్ మంచి  ఏడ్ తీయవచ్చు.
ప్రస్తుతం జగన్ పనులు కూడా అలానే ఉన్నాయి. వై.ఎస్.ఆర్. చనిపోయినపుడు ఆత్మహత్య చేసుకున్న, బాధతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని జగన్ అన్నప్పుడు చాలా మంచి నిర్ణయం అనిపించింది. కానీ వాస్తవం లో అది ఒక ప్రహసనం గా మారింది. పైగా కాంగెస్ ప్రకటించిన సంఖ్యకి, జగన్ సంఖ్యకి సంబందమే లేదు. పైగా ఓదార్పుయాత్రకి వచ్చే జనానికి తలకి 50 రూపాయలు ఇస్తున్నారనే విషయం బయటకు రావటం తో యాత్ర తేలిపోయింది. (కానీ ఈవిధంగా ప్రజలకు ఆదాయం చేకూరుతున్నందుకు సంతోషం గా ఉంది)  ఓదార్చే కుటుంబాల కన్నా ఆవిష్కరించే విగ్రహాల సంఖ్య ఎక్కువ కావటం, జగన్ "డాడీ" కాన్సెప్ట్ నుంచి బయటకు రాకుండా, మొక్కుబడిగా 2 రోజులు రైతుల కోసం దీక్ష చేసి "డాడీ" ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కాంగ్రెస్ పై విమర్శలతోనే కాలం వెళ్ళబుచ్చటం, తనకు తానుగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవటం చాలా హాస్యాస్పదం గా ఉన్నాయి. జగన్ వాస్తవం లో జీవించటం నేర్చుకోకపోతే ముఖ్యమంత్రి కావటం అలా ఉంచి తను గెలవటం కూడా అనుమానంగా మారుతుంది.

Saturday, January 1, 2011

శుభాకాంక్షలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.