Wednesday, December 29, 2010

కంచే చేను మేస్తే???

ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏ.లు విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే చట్టానికి వ్యతిరేకంగా ఇటువంటి పనులు చేస్తుంటే కంచే చేను మేసినట్లు లేదు? ఇటువంటి వారిపై చర్యలు తీసుకోలేమా?

డిశంబర్31 తరువాత పరిమాణాలపై చర్చలు, రెచ్చగొట్టే వాఖ్యానాలు ప్రసారం చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలపైనే చర్చ పెట్టిన మన టి.వి. వాళ్ళను ఏమనాలి? (విగ్రహారాధనని వ్యతిరేకించిన బుద్ధుడి విగ్రహానికి పూజలు చేసినట్లు) వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒకతను "ప్రజలు అంత అమాయకులా టి.వి.లో చూపించిన ప్రతీదానినీ నమ్మటానికి?" కనుక ఇటువంటి ఆదేశాలు అనవసరం అంటూ ఆవేశంగా వాదించాడు. ఒక్కసారి ఎవరినైనా అడగమనండి "మీ నాన్నగారి పేరేమిటని?" మరోసారి "నీ - - మొగుడి పేరేమిటని?" రెండోసారి జనం చెప్పుతో కొట్టకపోతే అప్పుడు అడగమనండి. జనానికి తెలుసుగదా "నాన్న" అన్నా "అమ్మ మొగుడు" అన్నా ఒకటే అని. మరి రెండోసారి ఎందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఏదైనా చెప్పే విధానంలో ఉంటుంది. జనం అర్థం చేసుకుంటారు కదా అని నోటికి వచ్చినట్లు వాగితే చెప్పు దెబ్బలు తప్పవు. అందుకే ఇటువంటి సున్నితమైన విషయాలలో సంయమనం పాటించమని ఆదేశాలు జారీ చేస్తే తప్పేంటి?

శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కనుక తమ ప్రాంతానికి వ్యతిరేకంగా వస్తే ఉద్యమం తీవ్రం చేస్తామని, రాజీనామాలు చేస్తామని రెండు ప్రాంతాల నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక కమిటీకి విలువ ఏముంది? ఇన్నాళ్ళు కమిటీపై చేసిన ఖర్చు వృధాయేనా?

రైలుని అత్యవసర పరిస్థితిలో ఆపటానికి చైన్ ఉంటుంది. దానిదగ్గర కూడా ఒక హెచ్చరిక రాసి ఉంటుంది. సరియైన కారణం లేకుండా చైన్ లాగితే ఇంత జరిమానా, ఇన్ని నెలలు జైలు శిక్ష అని. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని, ప్రజాధనం వృధా కాకూడదని. మరి ఇటువంటి మార్గదర్శకాలు ఎం.పీ.లకు, ఎం.ఎల్.ఏ.లకు ఎందుకు లేవు? ఇష్టం వచ్చినట్లు మధ్యలో రాజీనామాలు చేస్తారు? దీనివలన ప్రజాధనం, లక్షలాది ప్రజల విలువైన సమయం వృధా కావటం లేదా? సరియైన కారణం లేకుండా రాజీనామా చేసే వారు కానీ, వాళ్ళ పార్టీని కానీ ఆ ఖర్చు భరించమనాలి. ఇలా మధ్యంతర రాజీనామా చేసిన వాళ్ళని ఆ టర్మ్ మరియు మరియొక ఆరు సంవత్సరాలు ఎటువంటి పదవులకు పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వెయ్యాలి. అక్కడ మరలా ఎన్నిక నిర్వహించకుండా ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి ఉంటే (బతికుంటే, ఏకేసులలో ఇరుక్కొని జైలుకి వెళ్ళకుండా ఉంటే, పార్టీ మార్చకుండా ఉంటే) అతనికి అవకాశం ఇవ్వాలి. లేదా తృతీయ స్థానంలో ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి.

అనుభవానికి గౌరవం ఇవ్వటం మంచిదే. కానీ లేచి నిలబడటానికి కూడా ఓపిక లేని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు గుటుక్కుమంటారో తెలియదు. వీళ్ళ చరిష్మాని ఉపయోగించుకోవటానికి తప్పితే నిజంగా వాళ్ళ అనుభవమే కనుక కావాలనుకుంటే వాళ్ళు పదవిలో లేకపోయినా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు కదా. ప్రభుత్వ ఫించనుదారులకి ఒక నిభందన ఉంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి తాము బ్రతికే ఉన్నట్లు సర్టిఫికేట్ తెచ్చి ఇవ్వాలి. అలాగే వయోవృద్ధ నాయకులు కూడా పోటీ చేయబోయే ముందు సాధారణ పరిస్థితులలో (ఏ దుర్ఘటన జరగకుంటే, కుటుంబ సభ్యులు ఎటువంటి అఘాయిత్యం చేయకుంటే) మరో అయిదేళ్ళు బ్రతుకుతాడని డాక్టర్ సర్టిఫికేట్ తేవాలనే నిభందన పెట్టాలి.

ఇన్నిన్ని టాక్సులు కడుతూ ప్రజాధనం ఇలా వృధా కావటం చూస్తే ఎంతో బాదేస్తుంది. ఇటువంటి వాటిని సమర్ధవంతంగా అరికట్టగలిగితే రైతన్నలకు, చేనేత కార్మికులకు, చేతిపని వృత్తుల వారికి ఇంకామంచి సాయం అందించవచ్చు.  

3 comments:

  1. మీరు సంధించిన ప్రశ్నలూ, ప్రకటించిన అభిప్రాయాలూ నాకు చాలా నాచ్చాయి.

    correct రోడ్డెక్కి గోలచేసేనాయకులను కొన్నాళ్ళపాటు వారివారి పదవులనుండి సస్పెండ్ చేసి ఆకార్యకర్తలు చేసిన నిర్వాకాలకుగాను కలిగిన నష్టాన్ని ఆయా పార్టీలనుండి రాబట్టాలి. ఇలాంటిది ఒక తీర్పున్నట్లుంది బొంబాయి హైకోర్టుది.

    ఆత్మహత్య పాపమని, ఆపోరాడేదో బ్రతికేవుండి పోరాడమని చెబుతారుగా మరి ఎమ్మెల్యేలు/ఎం.పి. లు మాత్రం తమ పదవులకు పరిస్థితితో పోరాడగల అవకాశాలన్నింటినీ వదిలేసుకొని "సామాన్యుల్లాగా" రోడ్లెక్కడమెందుకో పదవుల్లో వుండి పోరాడరెందుకో? మధ్యంతర ఎన్నికల ఖర్చు రాబట్టి మరోసారి పోటీచెయ్యకుండా నిషేధిస్తేసరి. మీరన్నట్లు ఆ తరువాత ఎక్కువ వోట్లు వచ్చినాయన్ని ఆ పదవికి ప్రమోట్ చేస్తే తిక్కణుగుతుంది.

    వీళ్ళకి పదవినించి విరమించుకొనే అధికారం వున్నట్లు జనాలకు కూడా "ఇకచాలు ప్రతిపక్షంలో తగలడు" అని చెప్పగలిగే (రీకాల్ చేసే) అధికారం వుంటే చాలా బాగుంటుంది.

    వీటన్నికంటే ముందుగా జనాలకి కొంచెం బుధ్ధితెప్పించే మంత్రదండంకూడా.

    ReplyDelete
  2. చాలా బాగా వ్రాశారు.ఇలాంటివన్నీ పట్టించుకుని బాధ పడటం తప్పించి ఏమన్నా చేయగలమా?మీరు కోరుకుంటున్నవి జరిగేనా.మినర్వా గారు చెప్పినట్లు
    జనాలకి కొంచెం బుధ్ధితెప్పించే మంత్రదండం కావాలి.

    ReplyDelete