Friday, April 15, 2011

నక్షత్రపు చిహ్నం.

నేనూ స్వామీ పిచ్చాపాటీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా (మంచి విషయాలు ఎప్పుడు మాట్లాడుకున్నామనిలే!) టాపిక్ గుర్తుల / చిహ్నాల పైకి మళ్ళింది. అది దేశాల చిహ్నాలు, ఎన్నికల గుర్తులు, ఉత్పత్తుల గుర్తులు, వివిధ వ్యాధుల గుర్తుల మీదుగా ఆఖరికి మన తరగతి పుస్తకాలలో ముఖ్యమైన పద్యాల దగ్గర ఉండే నక్షత్రపు చిహ్నం దగ్గరకు వచ్చింది. స్కూలులో ఆఖరి పరీక్షలు దగ్గరి వచ్చినప్పుడు మాస్టార్లు ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టి చదివించటం గుర్తు వచ్చింది. మాటల్లో స్వామీ వాళ్లకు ప్రతి సబ్జెక్ట్ లోను ఒకటి రెండు అధ్యాయాలు పూర్తిగా చెప్పేవాళ్ళు కాదని చెపితే విని ఆశ్చర్య పోయాను. ఛాయిస్ ఉండే చోట కష్టమైనా అధ్యాయాలు వదిలేస్తారట. పోనీ వాళ్ళదేమన్నా ప్రైవేటు స్కూలా అంటే అదీ కాదు. అన్ని అధ్యాయాలు బోధించనవసరం లేకపోతే అవి పాఠ్యాంశాలుగా ఎందుకు ఉన్నట్లు? రేంకుల పిచ్చిలో ముఖ్యమైన వాటిని బట్టీ కొట్టించటం సబబేనా? అలా మాట్లాడుకుంటూ మా పదవ తరగతి రోజులలోకి (1997 బేచ్) వెళ్లి పోయాను.
మాది  ప్రభుత్వ పాఠశాల. బిట్ బేంకులు, కొచ్చెన్ బేంకులు, స్టడీ మెటీరియల్, ఆల్ ఇన్ వన్ ల గురించి వినటమే కానీ మాలో ఎవ్వరి దగ్గరా ఉండేవి కావు. మాస్టార్లు ప్రతి సంవత్సరం పదవ తరగతి ఆఖరి పరీక్షల పేపర్లు ఫైల్ చేసి ఉంచేవాళ్ళు. ప్రతి సబ్జెక్ట్ లోనూ ప్రశ్నలకు జవాబులను వాచకంలో గుర్తు పెట్టటమో లేక నోట్సు చెప్పటమో చేసేవాళ్ళు. ఇంగ్లిష్ అయితే అలా గుర్తు పెట్టటం కుదరని వాటికి జవాబులను (నేను లేదా ఉల్లి రామాంజనేయులు)  బ్లాక్ బోర్డ్ పై రాస్తే నోట్స్ రాసుకునేవాళ్ళం. నోట్సులు కరెక్షన్ చేయటం కూడా జరిగేది. 7, 10 తరగతులకి పబ్లిక్ పరీక్షలు ఉండటంతో రోజూ ఉదయం, సాయంత్రం 2 గంటల చొప్పున ట్యూషన్ (నామమాత్రపు ఫీజుతో) ఉండేది. ట్యూషన్ కి కూడా తరగతి ఉపాధ్యాయులే వచ్చేవాళ్ళు. మా స్కూలు క్రమశిక్షణ తో ఉండటానికి ముఖ్య కారణం మా ప్రధానోపాధ్యాయులు పిచ్చిరెడ్డి గారే అయినా పొగడవలసి వస్తే ముందుగా మా సాంఘిక శాస్త్రం మాస్టారు స్వర్గీయ గుదే వెంకటేశ్వర్లు గారు గుర్తు వస్తారు. వారు మాకు 8, 9, 10వ తరగతులలో సాంఘిక శాస్త్రం బోధించారు. ఆయనకి బోధనలో తనదైన శైలి ఉండేది. 60 మంది ఉన్న మా క్లాసుని 10 మంది చొప్పున 6 గ్రూపులు చేసారు. ప్రతి గ్రూపుకి ఒకరు లీడర్ గా ఉండేవాళ్ళు. ప్రతి గ్రూపు రోజు మార్చి రోజు 3 లేదా 4 ప్రశ్నలు చొప్పున చూడకుండా వ్రాయాలి. ఆ తరువాత ఒకరి వ్రాసిన దానిని మరొకరం కరెక్షన్ చేసేవాళ్ళం. రాసిన దానిని బట్టి గరిష్టంగా 5 సార్ల వరకు ఇంపోజిషన్ ఇచ్చుకునే వాళ్ళం. దీనికి తోడూ రోజుకు నలుగురు చొప్పున (ఒకరు భూగోళశాస్త్రం, ఒకరు చరిత్ర, ఒకరు పౌరనీతిశాస్త్రం మరొకరు ఆర్ధికశాస్త్రం) నాలుగు పాఠాల నుంచి బిట్లు తయారు చేసుకు వచ్చి క్లాసులో మిగిలిన వాళ్ళను అడిగేవాళ్ళు. చెప్పలేని వారికి  5 సార్లు ఇంపోజిషన్. వాటిని తయారు చేసేవాళ్ళు పాఠంలోనుంచి వాళ్ళ ఇష్టమొచ్చిన వాటిని బిట్లుగా వ్రాసుకొస్తారు కనుక ఖచ్చితంగా పాఠం మొత్తం చదవాల్సి వచ్చేది. వీటికి తోడూ వారం లో ఒక రోజు వక్తృత్వ పోటీలు. ఈ వారం ఒక టాపిక్ చెపుతారు వచ్చేవారం దానిపై మాట్లాడాలి. దీనిలో హాజరు పెంచటం కోసం ప్రతివారం అయిదుగురు చొప్పున ఖచ్చితంగా పాల్గొనాలి, స్వచ్చందంగా పాల్గొనేవాళ్ళు ఎంతమందైనా పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఏ కారణం చేతనైనా గైర్హాజరైతే ఆ తరువాత వారం పాల్గొనాలిసిందే. ఎలాగూ తప్పించుకోలేం కనుక ఈ కారణం వలన ఎవరూ గైర్హాజరు అయ్యేవాళ్ళు కాదు.
ఇప్పుడు నేను కొంత మంది స్కూలు పిల్లలో గమనించినదేమిటంటే మీరు వాళ్ళని ప్రశ్నలు వరుసలో అడుగుతున్నంతసేపూ జవాబులు టకటకా అప్పచెపుతారు. అదే వరుస మార్చామనుకోండి, బ్రేకు పడిపోతుంది. ఎన్నో ప్రశ్న అని అడుగుతారు. వీళ్ళు చేసే తప్పేమిటంటే జవాబుల వరకే చదువుతారు తప్ప ప్రశ్నలు చదవరు. అందుకే వీళ్ళకి జవాబులు తెలుసు తప్ప అవి ఏప్రశ్నకి జవాబులో అంతగా గుర్తుండదు. కొంతమంది పిల్లలు ఇంగ్లీష్, హిందీ ప్రశ్నలను అర్థం చేసుకోలేక జవాబు తెలిసీ రాయలేక పోయేవారు. అందుకేనేమో మా ప్రధానోపాధ్యాయులు వారు జవాబుని చదివే ప్రతిసారీ ప్రశ్నను కూడా చదవాలని పదే పదే చెప్పేవాళ్ళు. ఆయన మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా చెప్పేవాళ్ళు. పాఠం చెప్పేక ముఖ్యమైన / కఠిన పదాలకు అర్థాలు నోట్సులో వ్రాయించి ఒకటి రెండు రోజులు వాటిని చదివించి ఆ తరువాతే ప్రశ్నలు జవాబులు చెప్పేవారు.
మాకు 10 వ తరగతిలో బోధించిన ఆరుగురిలో ఇద్దరు స్వర్గస్తులయ్యారు. మిగిలిన నలుగురిలో ఎవరైనా కనపడినప్పుడు పలకరిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు.అటువంటి 
అధ్యాపకులు దొరకటం నిజంగా మా అదృష్టం తప్ప వేరే ఏమీ కాదు .

No comments:

Post a Comment